వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని జురెక్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జురెక్‌ ఎయిర్‌పోర్టు నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో దావోస్‌‌కు బయలుదేరారు. జురెక్ ఎయిర్‌పోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు  రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌ జగన్‌కు సాదర స్వాగతం పలికారు. 








స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్‌ సీఎం జగన్‌కు అక్కడ ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ మే 20న విజయవాడ నుంచి బయలుదేరారు. మే 22 నుంచి మే 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) సదస్సు జరగనుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, సహకారం గురించి ఈ సదస్సులో రాష్ట్ర నేతలు విస్తృతంగా చర్చిస్తారు. 


మే 22న కార్యక్రమాలు:
– వర్డల్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సు జరగనున్న కాంగ్రెస్‌ వేదికగా ఆదివారం ఉదయం డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనుంది. డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో  రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం  లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది. 
– డబ్ల్యూఈఎఫ్‌ హెల్త్‌కేర్‌– హెల్త్‌ విభాగం అధిపతి, డాక్టర్‌ శ్యాం బిషేన్‌తోకూడా సీఎం సమావేశం అవుతారు. 
– దీనితర్వాత మధ్యాహ్నం బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హన్స్‌ పాల్‌బర్కనర్‌తో ముఖ్యమంత్రి ఏపీ లాంజ్‌లో సమావేశం కానున్నారు. 
– సాయంత్రం డబ్ల్యూఈఎఫ్‌ కాంగ్రెస్‌ వేదికలో జరిగే వెల్‌కం రిసెప్షన్‌కు సీఎం హాజరవుతారు. 


జురెక్, దావోస్‌ల్లో సీఎం జగన్ కు ఘన స్వాగతం
జురెక్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. దావోస్‌లో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టుగోవిందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కృష్ణగిరి, పలువురు అధికారులు ఉన్నారు. రోడ్డు మార్గంలో సీఎం దావోస్‌ చేరుకున్నారు.