YS Jagan Case :     ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. శుక్రవారం జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.  జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నారని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ఇచ్చిన రిప్లై ఆధారంగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును రఘురామ సుప్రీంలో సవాలు చేశారు.


గత విచారణలో నోటీసులు జారీ 


గత విచారణలో  ఏపీ సీఎం జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రఘురామ వేసిన బదిలీ పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.   విచారణ సందర్భంగా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులుగా ఉన్న అరబిందో, హెటిరో గ్రూప్, డ్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.నిత్యానంద రెడ్డి, పి.శరత్ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, యద్దనపూడి విజయలక్ష్మి, పీఎస్ చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థలకు నోటీసులిచ్చింది.  


నత్తనడకన విచారణ


సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ పదేళ్లుగా నత్తనడకన సాగుతోందని, అందుకే మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయి. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదు. ప్రధాన నిందితుడు జగన్ కు ఇష్టానుసారంగా వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారు. దీని వల్ల కేసు విచారణకు అంతు లేకుండా పోతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కేసు విచారణ ప్రారంభమయ్యే స్థితి కనిపించడం లేదు. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. ఈ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి.' అని రఘురామ పిటిషన్ లో పేర్కొన్నారు. నిజానికి వైసీపీ ఎంపీ అయిన రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి రెబల్ గా మారారు. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయన్న ఓసారి ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో రఘురామ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకమయ్యారు. ఆయనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ అధినేత జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన పార్టీ ఫిరాయించలేదు. ఈ కారణంగా వేటు పడలేదు. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా వేయలేదు. దీంతో అధికారికంగా వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు. 


గతంలోనూ దిగువ కోర్టలో జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ 


సీఎం జగన్ పై గతంలోనూ ఎంపీ రఘురామ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో నిందితులైన వారికి వివిధ పదవులు కట్టబెట్టడం, ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నారని ఇందుకు సాక్ష్యాలుగా కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించారు.