Free Bus Scheme For Women : ఒకప్పుడు మహిళలు ఇంటికి మాత్రమే పరిమితం అయ్యే వాళ్లు. ఇంటి పనుల్లోనే బిజీగా ఉంటే ఇంట్లోని మగవాళ్లు ఉద్యోగాలకు బయటకు వచ్చే వాళ్లు. కాలంతోపాటు వారి స్థాయి కూడా మారింది. ఇప్పుడు మహిళలు కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇలాంటి వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయ కల్పిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఊళ్లకు వెళ్లే వారి సంగతేమో కానీ ఉద్యోగాలు చేసుకునే వారికి మాత్రం కచ్చితంగా సదుపాయంగా ఉంది. నెలకు ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకు మిగులుతున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరి పోయింది. ఆ రాష్ట్రంలో నేటి నుంచి ఉచిత బస్ ప్రయాణం అమల్లోకి రానుంది. ఇలాంటి స్కీమ్‌ ఏయే రాష్ట్రాల్లో ఉందో ఇక్కడ తెలుసుకుందాం. 

మహిళలకు ఉచిత ప్రయాణం కేవలం ఓ పథకంలా చూడటం సరికాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మహిళల సాధికార, సామాజిక ఆర్థిక పురోగతికి సాధనంగా మారుతుందని అంటున్నారు. 

ఢిల్లీ

భారత దేశంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అనే కాన్సెప్టును తీసుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. 2019లో కేజ్రీవాల్‌ ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. మహిళా సమ్మాన్ యోజనా పేరుతో మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కల్పించారు. నార్మల్‌బస్‌లలో అందరూ ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఏసీ బస్‌లలో మాత్రం రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ స్కీమ‌ ద్వారా రోజుకు పది నుంచి పన్నెండు లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు.  

తమిళనాడు 

ఢిల్లీ తర్వాత మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిన రాష్ట్రం తమిళనాడు. విద్యాసాగర్ బస్ పథకం పేరుతో 2021ను ఇంప్లిమెంట్ చేస్తోంది. రాష్ట్రంలో తిరిగే బస్‌ల్లో మహిళలంతా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే కేవలం 30 కిలోమీటర్ల వరకు మాత్రమే తిరిగే అవకాశంఉంది. ఒక మహిళ రోజుకు కేవలం 30కిలోమీటర్లే ఉచితంగా ప్రయాణం చేయగలదు. అంతకు మించి ప్రయాణం చేయాలంటే మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయినా ఈ పథకం వల్ల రోజుకు ఇరవై నుంచి ముఫ్పై లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 

పంజాబ్‌

తమిళనాడుతో పాటే పంజాబ్‌లో కూడా మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్‌ అమలు చేస్తున్నారు. అక్కడ ఆర్టీసీకి ప్రభుత్వం డబ్బులు చెల్లింపులో జాప్యంతో కొనసాగింపుపై చాలా రగడ జరుగుతోంది. ఛండీగఢ్‌, పంజాబ్‌లలో మహిళలు ఉచితంగా తిరగవచ్చు. 

కర్ణాటక

కర్ణాటలో శక్తి స్కీమ్‌ పేరుతో ప్రభుత్వం ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. 2023 జూన్ నుంచి శక్తి స్కీమ్ అమలులోకి వచ్చింది. రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. KSRTC, BMTC, NWKRTC బస్‌లలో రాష్ట్రంలో తిరిగే సర్వీసులకు మాత్రమే పథకాన్ని అమలు చేస్తున్నారు. 

తెలంగాణ 

మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. 2023 డిసెంబ్‌ 9 నుంచి అంటే సోనియా గాంధీ జన్మదినం నుంచి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎలాంటి వయో పరిమితి లేదు. ప్రభుత్వం సూచించిన రాష్ట్ర సర్వీస్‌లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు వెళ్లి రావచ్చు. ఈ పథకం ద్వారా రోజుకు పది నుంచి పదిహేను లక్షల మంది లబ్ధి పొందుతున్నారు.  

జమ్ముకశ్మీర్‌

జమ్ముకశ్మీర్‌లో కూడా 2025 ఏప్రిల్ నుంచి స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభమైంది. ఇది స్మార్ట్ సిటీ ఇ-బస్‌లు, జేకే ఆర్టీసీ బస్సులకు వర్తింపజేససింది. ఈ సేవలు శ్రీనగర్ దాని చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారు. అందుకే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలగడం లేదు.

మహారాష్ట్ర

మహారాష్ట్రంలో కూడా మహిళా సౌభాగ్య యోజనా పేరుతో డిసెంబ్‌ 2024 నుంచి ప్రారంభమైంది. ముంబై, పూణెలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దీన్ని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. క్రమంగా మిగతా ప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో 2025 ఆగస్టు 15నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభమైంది. మహిళలకు, బాలికులకు, ట్రాన్స్‌జెండర్లుకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. శ్రీ శక్తి పేరుతో నిర్వహించే పథకం పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో ఫ్రీగా రాష్ట్రమంతా మహిళలు తిరగొచ్చు. ఈ రాష్ట్రంలో రెగ్యులర్‌గా మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అందిస్తుంటే... కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక సందర్భాలు, ప్రత్యేక కేటగిరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లలో రాఖీ పండగ రోజు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సందర్భాలు ఉన్నాయి. కేరళలో మత్స్యకారమహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే వారు చేపలు అమ్ముకోవడానికి వెళ్లేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు.