AP Weather Updates: చలి గాలుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అధికంగా ఉంటుంది. ఓ వైపు తక్కువ ఎత్తులో ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులతో ఉత్తరాంధ్రలో, తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలులతో దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉత్తర, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తక్కువా నమోదు కానున్నాయి. కొన్ని చోట్ల పొగ మంచు కురియడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.


పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. పాడేరు ఏజెన్సీలో కనిష్టం 6 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దట్టమైన పొగ మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొనసీమ ప్రాంతాలైన అమలాపురం, రాజోలులో..  గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోనూ పొగ మంచు దట్టంగా కురవడంతో ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. ఉదయం వేళ ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. నెల్లూరు జిల్లాలో కూడ పొగ మంచు కురవనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి చలి గాలులు వీస్తున్నాయి కనుక చల్లదనం ఎక్కువై ఉష్ణోగ్రతలు భారీ పడిపోతాయి. మరోవైపు సముద్రం నుంచి వీస్తున్న గాలులతో ప్రజలకు చలి మరింత ఎక్కువ కానుందని సూచించారు.



దక్షిణ కోస్తాంద్రలో మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. పొగ మంచు కారణంగా ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాయలసీమలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.






తెలంగాణ వెదర్ అప్‌డేట్..
రాష్ట్రంలో పలుచోట్ల ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని రోజులపాటు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, కొమురం భీమ్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో చలి గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ 11 జిల్లాల్లో ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ ప్రకటించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె నాగరత్న తెలిపారు. ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నమోదు కానున్నాయని అంచనా వేశారు. 17 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వనపర్తి, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే అధికంగా ఉండనుంది. 
Also Read: Anakapalli Two Girls Fact Check: అనకాపల్లి అమ్మాయిలు అబ్బాయి కోసం కొట్టుకున్నారా? అసలు జరిగింది ఇదే.. ! ఆ అమ్మాయిల జీవితం ఇప్పుడెలా ఉందో తెలుసా ?


Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి