Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఉదయమ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని కస్టడీ పిటిషన్ లో సీబీఐ పేర్కొంది. సాక్ష్యాలను తారుమారు చేయడంలో ఉదయ్ ముఖ్య పాత్ర పోషించాడని వివరించింది. అలాగే గూగుల్ లొకేషన్ ఆధారంగా అవినాష్ ఇంట్లో ఉదయ్ ను గుర్తించామని.. ఆయనను విచారిస్తే మరికొంత మంది పాత్ర బయటపడుతుందని తెలిపింది. ఈ క్రమంలోనే సీబీఐ కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై కూడా నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. భాస్కర్ రెడ్డిని 10 రోజుల క్సటడీకీ కోరుతూ సీబీఐ పిటిషన్ వేసింది. నిన్ననే ఆయనను పులివెందులలో సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హత్యలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని.. కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపింది. 


సహనిందితుడిగా అవినాష్ రెడ్డి..


మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల జాబితాలో తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా సీబీఐ చేర్చింది. ఇప్పటి వరకు ఈ కేసులో అవినాష్ రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నాలుగు సార్లు విచారించినప్పుడు సాక్షిగానే వాంగ్మూలాలు నమోదు చేసింది. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భఆస్కర్ రెడ్డిని ఆదివారం పులివెందులలో అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్ లోని సీబీఐ జడ్జి నివాసంలో అధికారులు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగగా భాస్కర రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ లో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్నారు. హత్య తర్వాత సహనిందితులు డి శివశంకర్ రెడ్డి, టి.గంగిరెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అభియోగం మోపారు. దీంతో తొలిసారిగా అవినాష్ రెడ్డి నిందితుల జాబితాలో ఉన్నట్లు బహిర్గతమైంది. 


ఇప్పటి వరకు జరిగిన సీబీఐ విచారణల్లో అనుమానితుడిగానే సీబీఐ పరిగణించింది. కానీ, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన్ను సీబీఐ జడ్జి ముందు ప్రవేశ పెట్టినప్పుడు భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్నారు. 3 గంటల సమయంలో హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు హాజరు అయ్యేందుకు అవినాష్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇది ఐదోసారి. సీబీఐ అధికారుల ఎదుట హాజరు కావడం కోసం పులివెందులలోని తన నివాసం నుంచి నేడు తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు బయలు దేరారు. ఉదయం 5.30 గంటలకు అవినాష్ రెడ్డి పులివెందులలోని తన ఇంటి నుంచి బయలుదేరారు.