YSRCP MLC Duvvada Srinivas Comments In Srikakulam: వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అయిన వేళ ఆ పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే, నేడు (మే 30) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీ నేత అచ్చె్న్నాయుడు లక్ష్యంగా దువ్వాడ శ్రీనివాస్ తీవ్రమైన కామెంట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి జోలికి కనుక వస్తే అవసరమైతే తాను ఆత్మాహుతి దళంగా మారేందుకు సైతం సిద్ధమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన కార్యక్రమంలో దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు.


టీడీపీ ఒంగోలు మహానాడులో జగన్మోహన్ రెడ్డిని తిట్టించి చంద్రబాబు, అచ్చెం నాయుడు ఆనందం పొందారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఎవరిని వదలబోనని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తల అంతు తేలుస్తామని అనడం దారుణమని వ్యాఖ్యానించారు.


అచ్చెన్నాయుడు గురించి వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన రాజకీయ పతనమే తన జీవిత లక్ష్యమని అన్నారు. తెలుగు దేశం పార్టీని తెలుగు దొంగలపార్టీ అంటూ అభివర్ణించారు. ఆ పార్టీ అద్యక్షుడు అచ్చెన్నాయుడు, వైసీపీ నేతల అంతుచూస్తానంటూ హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను గుడ్డలూడదీసి కొడతానని చెప్పానని గుర్తు చేశారు. అంకుశం సినిమాలో విలన్‌ను కొట్టినట్లుగా టెక్కలి రోడ్డుపై అచ్చెన్నాయుడుని దొర్లించి, ఈడ్చి కొట్టకపోతే నా పేరు దువ్వాడ శ్రీనివాస్ కాదని అన్నారు. అచ్చెన్నాయుడి రాజకీయ పతనమే తన ఆశయమని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి గురించి అధికారంలోకి వస్తే ఏం చేస్తామని కూడా చెప్పలేకపోతున్నారని అన్నారు. టీడీపీ నేతలు పిచ్చి కలలు కంటున్నారని.. టీడీపీ అధికారంలోకి రావడం భ్రమ అని కొట్టిపారేశారు.


‘‘మహానాడులో ఇష్టానుసారం పేలిన వారికి హెచ్చరిస్తున్నాం. ఇష్టానుసారం మాట్లాడితే జగన్ కోసం ఆత్మాహుతి దళంగా మారిపోతా. జగన్ కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధం. నాకు ప్రాణం మీద భయం, జీవితం మీద ఆశలు రెండూ లేవు.’’ అని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.