Srikakulam News: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. గొడవలను ఆపేందుకు మధ్యవర్తులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవేవీ కొలిక్కి రావడం లేదు. ఇరు వర్గాలను శ్రేయస్సును, పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయన భార్య దువ్వాడ వాణి తన దీక్షను కొనసాగిస్తున్నారు. 


శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ వాణి నిరసన దీక్ష ఆరో రోజూ కొనసాగుతోంది. తన కుమార్తెలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చున్న ఆమె... తమను ఇంట్లోకి రానివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి సమీపంలో ఉన్న షెడ్‌లో దీక్ష చేస్తున్నారు. 


విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ కావడం పది మంది పది రకాలుగా మాట్లాడుకోవడంతో పోలీసు స్టేషన్లతో ఇరు వర్గాల ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో మధ్యవర్తులు రంగంలోకి దిగారు. పరిస్థితిని కూల్ చేసి మధ్యే మార్గంగా సమస్యను పరిష్కరించేందుకు ఇరు వర్గాలతో చర్చలు జరుపుతన్నారు. మూడు రోజుల నుంచి జరుగుతున్న చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు. 


ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్‌ ఉంటున్న ఇల్లు తప్ప ఏ ఆస్తులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వైసీపీ ఎమ్మెల్సీ చెబుతున్నారు. ఆ ఇల్లు వాళ్లకు ఇచ్చిన మరుక్షణమే తనను ఇంటి నుంచి బయటకు నెట్టేస్తారని ఆరోపిస్తున్నారు. అందుకే తాను ఆ ఇంటిని ఇవ్వలేనంటూ తేల్చి చెబుతున్నారు. ఇంత రచ్చ చేసిన వాణితో కలిసి ఉండలేనని విడాకులు తీసుకుంటానని చెబుతున్నారు. 


వాణి మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తన కుమార్తెల పేరున రాయాలని అంటున్నారు. విడాకులు ఇచ్చేందుకు కూడా ఆమె అంగీకరించడం లేదు. కుమార్తెల బాధ్యత పూర్తిగా ఆయన చూసుకోవాలని చెబుతున్నారు. 


ఇలా ఒక్కొక్కరు ఒక్కో తీరున ఉండడంతో సమస్య పరిష్కారం చాలా జఠిలంగా మారింది. ఇరు వర్గాల్లో ఎవరూ ఒక అడుగు కూడా తగ్గి రాకపోవడంతో సమస్య ఇంకా పరిష్కారం కావడం లేదు. 


మరోవైపు వివాదానికి  కారణమైన మాధురి వైజాగ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత తన ఇంట్లో రెస్టు తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు రీల్స్ చేస్తున్నారు.  రోజుకో వీడియోతో సంచలనం సృష్టిస్తున్నారు. తాను మోసపోయానంటూ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ పాటలు కూడా పాడారు. ఆమె వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాల్‌లో ఓ పోస్టు పెట్టారు. నువ్వు పక్కనుంటే చాలు కన్నీళ్లన్నీ ఇలా నవ్వులై నన్ను చేరాతాయంటూ పోస్టు పెట్టారు. 






అంతే కాకుండా దువ్వాడ శ్రీనివాస్ మంచి నటుడు అంటూ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో నటించాలనే కోరిక దువ్వాడకు ఉందని అన్నారు మాధురి. ఆ ప్రయత్నాలు కూడా జరిగాయని అయితే ఒకరి దగ్గర పని చేసే ఉద్దేశం లేకనే విరమించుకున్నారని అభిప్రాయపడ్డారు. 




దువ్వాడ టాలెంట్‌ తెలుసుకొనే ఓ సినిమా కూడా తన డబ్బులు పెట్టి తీశానని అన్నారు. కేరళ నుంచి ఓ నటిని తీసుకొచ్చి సినిమా తీశామని వివిరంచారు. ఎన్నికల్లో పడి ఆ సినిమా రిలీజ్ సంగతే పక్కనే పెట్టేశామన్నారు.