వందే భారత్ రేక్ స్థానంలో నేటికి సంప్రదాయ కోచ్‌లు అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే అదికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రైలు నెంబర్ 20833/34 (విశాఖపట్టణం -సికింద్రాబాద్ - విశాఖపట్టణం) స్థానంలో వందే భారత్ రైలు స్థానంలో సంప్రదాయ బోగీలు అమర్చారు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే, వందే భారత్ రైలులో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులందరికీ వసతి కల్పించడానికి కొత్త రైలు ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. 


విశాఖపట్టణం నుంచి 05:45 గంటలకు బయల్దేరాల్సిన రైలు 07:05 గంటలకు బయలుదేరిందని అన్నారు. వందే భారత్ రైలు సర్వీసులతో సమానంగా ప్రయాణికులందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. రైలు రద్దవడంతో ప్రయాణికులందరికీ ఆటోమేటిక్ రీఫండ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక రైలులో టికెట్లు జారీ చేశామని పేర్కొన్నారు. ఫెసిలిటేషన్ కౌంటర్ ఏర్పాటు చేశామని, అన్ని స్టేషన్లలో క్రమం తప్పకుండా ప్రకటనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్స్ విఎస్ కెపి రైలు వెంట ఒక అధికారితో పాటు 9 మంది టిటిఇలు ఉన్నారని, ఐఆర్సీటీసీకి చెందిన 34 మంది కేటరింగ్ స్టాఫ్, ఇద్దరు సూపర్వైజర్లు రైలులో ఉన్నారని పేర్కొన్నారు. 


రిటర్న్ జర్నీలో కూడా...
ట్రైన్ నెంబర్ 20834 (సికింద్రాబాద్ - విశాఖపటట్ణం) సాంకేతిక లోపం కారణంగా రైలు నెంబర్ 20834, (ఎస్సీ - వీఎస్కేపీ) వందే భారత్ స్థానంలో సంప్రదాయ కోచ్ రైలును పెట్టారు. రైలులో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ అవసరాలను తీర్చుకునేలా రైల్వే శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. రైలులో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఈ మేరకు వారి సెల్ ఫోన్‌ నెంబర్లకు మెసేజ్‌లు పంపుతున్నామని ప్రతి స్టేషన్‌కు ముందే ప్రయాణీకులను అలర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణీకులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చని, లేదంటే ప్రత్యేక కన్వెన్షన్ రేక్ ద్వారా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.  


ప్రయాణీకులు తమ టికెట్‌ను రద్దు చేసుకుంటే, వారికి పూర్తి రీఫండ్ చేస్తామంటున్నారు రైల్వే అధికారులు. ప్రత్యేక రైలులో ప్రయాణిస్తే, ప్రయాణీకులకు ఛార్జీల వ్యత్యాసం కూడా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరుతుంది. వందే భారత్ రైలు సర్వీసులతో సమానంగా ప్రయాణికులందరికీ క్యాటరింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని స్టేషన్లలో క్రమం తప్పకుండా ప్రకటనలు చేస్తున్నామని,  ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి తగినంత టికెట్ చెకింగ్ స్టాఫ్, సెక్యూరిటీ, క్యాటరింగ్ సిబ్బందిని నియమించామని రైల్వే శాఖ వెల్లడించింది.


రేపటి నుంచి యథావిధిగా...
సాంకేతిక లోపం కారణంగా గురువారం మాత్రమే వందేబారత్ రైలులో మార్పులు చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో ప్రయాణీకులకు జరిగిన అసౌకర్యానికి చింతుస్తున్నామని, రాబోయే రోజుల్లో యథావిధిగా రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మరమ్మత్తుల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పలువురు అధికారులు చెబుతున్నారు.