దువ్వాడ స్టేషన్‌లో ప్రమాదానికి గురైన బతుకు పోరాటం చేసి తనువు చాలించిన ఎంసీఏ విద్యార్థిని శశికళ ఉదంతం అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాయగడ ఎక్స్ ప్రెస్‌కీ రైల్వే ప్లాట్ ఫాంకీ మధ్య నలిగిపోయి గంటన్నర పాటు నరకం అనుభవించి ఆపై హాస్పిటల్‌లో కూడా మృత్యువుతో ఫైట్ చేసింది. టైలరింగ్‌తోనే జీవనం సాగిస్తూ కుమార్తె పెద్ద ఉద్యోగం చేస్తుందనీ తమ జీవితాలు బాగుపడతాయి శశికళ తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న ఆ మధ్యతరగతి కుటుంబం కలలు చిన్నాభిన్నమయ్యాయి. ఇంకో రోజు గడిచి ఉంటే హాస్టల్‌లో చేరి ఉండేది. అనుకున్నట్టుగానే అంతా సాఫీగా సాగేది. కానీ విధి ఆడిన ఆటలో శశికళ, ఆమెతోపాటు ఆ కుటుంబం రెండూ బలి అయ్యాయి. 


హాస్టల్‌లో చేరడం కోసం అన్నవరం నుంచి దువ్వాడ వరకూ ట్రైన్‌లో జర్నీ చేసింది శశికళ. ప్లాట్ ఫాంపై దిగుతున్న సమయంలో వెనుక నుంచి డోర్ గట్టిగా కొట్టింది. దీంతో పట్టు తప్పిన శశికళ ప్లాట్ ఫాంకీ ట్రైన్‌కీ మధ్య ఉన్న ఖాళీలో జారిపోయింది. ఓ వైపు నడుము క్రింది భాగం నలిగిపోయింది. మరొకవైపు అక్కడి నుంతి బయటపడలేక ఆమె అనుభవించిన బాధ అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. శశికళ ఆర్తనాదాలు ఇంకా అక్కడి వారి చెవుళ్లలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. 


శశికళను రక్షించడానికి అక్కడి వారంతా తలో చేయి వేశారు. రైల్వే సిబ్బంది ప్లాట్ ఫామ్ బద్దలుకొట్టారు. ఆమెను బయటకు తీశారు. అప్పటికే ఆమె స్పృహకోల్పోయి ఉంది. సుమారు రెండు గంటల పాటు ఆ నరకయాతన అనుభవించి భరించ శక్తి లేక స్పృహకోల్పోయింది. రెండు గంటల తర్వాత ఆమెను బయటకు తీసిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆమె ప్రాణాలకు ముప్పు లేదనుకున్నారు. కానీ ఈ దుర్ఘటనలో ఆమె నడుముతోపాటు ఇతర అవయవాలు నలిగిపోయాయి. ఇంటర్నల్‌ బ్లీడింగ్ అయింది. కొన్ని అవయవాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో 24 గంటల పాటు మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచింది. 


హాస్పిటల్ వద్ద తోటి స్టూడెంట్ల కన్నీళ్లు 


అన్నవరం సమీపంలోని గోపాలపట్నం గ్రామానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలజీలు తెరచిన యాజమాన్యం హాస్టల్స్ ఇంకా తెరవకపోవడంతో గత 20 రోజులుగా గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ లో డైలీ సర్వీస్ చేస్తుంది. అనుకోకుండా ఇలా ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులతోపాటు తోటి విద్యార్థులు షాక్‌కి గురయ్యారు. ఆమె హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి చాలా మంది ఆసుపత్రి ఆవరణలోనే దిగాలుగా కూర్చొండిపోయారు. శశికళ మళ్ళీ కోలుకుని ఎప్పటిలానే తమతో కలిసి చదువుకుంటుందని భావించిన వారంతా ఆమె మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. హాస్పిటల్ వద్ద ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వారిని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళ కళ్ళు కూడా చెమర్చాయి. ఇక తల్లితండ్రులు బంధువుల పరిస్థితి అయితే చెప్పడానికి కూడా మాటలు రాని విషాదం. చదువుల సరస్వతిగా పేరు తెచ్చుకున్న శశికళ ఇలా అర్దాంతరంగా తమను వీడిపోతుందని ఏమాత్రం ఊహించని వారిని ఊరడించడానికి కూడా ఎవరికీ మాటలు రాలేదు . 


ఎవరి పాపం ఇది ?


అందరి దృష్టిలో ఇది ఒక ప్రమాదమే అయినా ఈ పాపం ఎవరిదనే ప్రశ్న కూడా జనంలో తలెత్తుతోంది. క్లాస్‌లతో పాటే హాస్టల్స్ ఒకేసారి ఎందుకు ప్రారంభించరో చెప్పని కాలేజీ యాజమాన్యానిది తప్పు అనాలా? లేక తల్లితండ్రుల పేదరికానిది తప్పు అనాలా? ఇవేవీ కాకుండా ఈ రూట్‌లో స్టూడెంట్స్‌కు, ఉద్యోగులకూ ఆందుబాటులో ఉండే ప్యాసింజర్ ట్రైన్‌లను ఆపేసిన రైల్వే శాఖది తప్పు అనాలా? కొంతకాలం క్రితం వరకూ విజయవాడ -రాయగడ ప్యాసింజర్ ఇలా డైలీ తుని, అన్నవరం లాంటి ప్రాంతాల నుంచి విశాఖకు డైలీ సర్వీస్ చేసే వారికి అందుబాటులో ఉండేది. దానిని ఇప్పుడు గుంటూరు -రాయగడ ఎక్స్ ప్రెస్ చేసేసింది రైల్వే శాఖ. ఈ రూట్‌లో నడిచే కాకినాడ-విశాఖపట్నం, మచిలీపట్నం-విశాఖపట్నం లాంటి అన్ని ప్యాసింజర్‌లనూ ఎక్స్ ప్రెస్‌లుగా మార్చిన రైల్వే శాఖ... విజయవాడ-విశాఖ పట్నం, రాజమండ్రి -విశాఖపట్నం లాంటి ట్రైన్‌లను కోవిడ్ తరువాత ప్రారంభించనే లేదు. దీంతో విశాఖకు పనుల మీద డైలీ సర్వీస్ చేసే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ట్రైన్స్‌లో చాలినన్ని జనరల్ బోగీలు లేక రిజర్వేషన్ బోగీల్లోనే డోర్ వద్ద వేలాడుతూ జర్నీ చేస్తున్నారు. 


ఇలాంటి తప్పిదానికే శశికళ బలైందా అన్న చర్చ కూడా జనంలో మొదలైంది. ఇలాంటి ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నప్పుడు వెంటనే దాని నుంచి బయటపడేసే అత్యాధునిక పరికరాలు రైల్వే వద్ద ఉన్నాయా అని కూడా జనం చర్చిస్తున్నారు. శశికళ ప్లాట్ ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాక ఆమె బయటపడటానికి గంటన్నర సమయం పట్టింది. అక్కడే ఆమె శరీరంలో ఎక్కువగా బ్లీడింగ్ జరిగింది అని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా అనేక రకాలుగా శశికళ మరణంపై ప్రజల్లో అనేక రకాలుగా చర్చలు మొదలయ్యాయి. ఏదేమైనా చేతికి అందివస్తున్న ఒక్కగానొక్క కుమార్తె ఇలా దుర్మరణం పాలవడంతో భవిష్యత్తు అంధకారమై బిక్కుబిక్కు మంటున్న ఆ మధ్యతరగతి  తల్లితండ్రుల బాధను ఓదార్చేవారెవరు ?