Visakha News: విశాఖపట్నం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన పోరుబాటుపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రుషికొండలో తవ్వకాలు, అక్రమ కట్టడాలు, దసపల్లా భూములు, పేదల స్థలాల ఆక్రమణ తదితర అంశాలపై టీడీపీ నేటి నుంచి ఆరు చోట్ల ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి వెళ్లాలనుకనే నాయకులను గురువారం నుంచి పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. శుక్రవారం ఉదయం కూడా గృహ నిర్బంధాలను కొనసాగించారు. పలు చోట్ల ఆ పార్టీ ముఖ్యనేతలను గృహ నిర్బంధం చేశారు. అయితే ఈరోజు రుషికొండ వెళ్తామని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో విశాఖ నగరంలోని పలు చోట్ల పోలీసులు మోహరించారు. 






టీడీపీ జిల్లా కార్యాలయంతోపాటు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. విశాఖ వెళ్తున్న శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవి కుమార్, పాలకొండ టీడీపీ ఇన్ ఛార్జీ నిమ్మక జయకృష్ణను తగరపువలస వద్ద భీమిలి పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు.


విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద సుమారు 100 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అవసరం అయితే అరెస్టులు కూడా చేసేందుకు మూడు వాహనాలను సిద్ధం చేశారు. గురువారం రాత్రి మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన కుటుంబ సభ్యులతో సినిమా థియేటర్ కు వెళ్లినా పోలీసుల ఆంక్షలు తప్పలేదు. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు థియేటర్ వద్దకు వచ్చారు. 






ఈ ఉదయం విశాఖలో అనిత ఇంటికి వెళ్లిన పోలీసులు... ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని బయటకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్తున్న తమను అడ్డుకోవద్దని అనిత కోరారు. పోలీసులు అడ్డుకోవడంతో వాహనం దిగి నడుచుకుంటూ బయల్దేరిన అనిత, సంధ్యారాణిని కొద్ది దూరం అనుసరించిన పోలీసులు.. ఆ తర్వాత బలవంతంగా వాళ్లను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికండ పరిరక్షణ కోసం సీఎం జగన్ పోలీసులను వినియోగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె మండిపడ్డారు. అంతే కాకుండా రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. 


పోలీసుల ఆంక్షలతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు చిన్నారులతో వచ్చిన వాళ్లు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలను నిలిపివేయడంతో లగేజీ మోసుకొని నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. 


ఈ నిర్బంధాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో వైసీపీ దోపిడీపై టీడీపీ పోరుబాటను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కొండలను సైతం మింగుతున్న వైసీపీ అనకొండల బండారం బయట పెట్టేందుకే తమ నేతల పోరుబాట అని తెలిపారు. మహిళా నేతలను సైతం నిర్బంధించడం పాలకుల అరాచకత్వానికి నిదర్శనం అన్నారు. 




ఉత్తారంధ్రను దోచకున్న నేతలు... తమ బండారం బయటపడుతుందని భయపడ్డారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఎవరు ఎంత అడ్డుకున్నా సేవ్‌ ఉత్తరాంధ్ర నినాదంతో ముందుకెళ్తామన్నారు. నేతలు చేస్తున్న అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.