విశాఖపట్నంలోని నావెల్ పరిసర ప్రాంతాల్లో మూడు రోజులుగా ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో తిరుగుతుండడం కలకలం రేపింది. నగరంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నావెల్ క్యాంటీన్ వద్ద వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడాన్ని నేవీ పోలీసులు గుర్తించారు. ఇతను గత మూడు రోజులుగా తూర్పు నావికా దళానికి సంబందించి ఐఎన్ఎస్ సర్కార్, డాక్ యార్డ్ వంటి కీలక ప్రదేశాల్లో తిరిగినట్లుగా గుర్తించారు. ఇతను ఏకంగా నేవీ యూనిఫాం ధరించి మూడు రోజులుగా వివిధ ప్రాంతాల్లో తిరిగాడని నేవీ పోలీసులు తెలిపారు.


ఈ రోజు (జూలై 26) ఉదయం నేవికి చెందిన తృప్తి క్యాంటిన్ వద్ద ఇతణ్ని గుర్తించి నేవీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మల్కాపురం పోలీసులకు నేవీ పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఉదయం నుంచి నేవీ అధికారుల అధీనంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.