Vangalapudi Anitha comments: గుడివాడ అమర్ నాథ్‌కు మెదడు మోకాలులో ఉందని.. ఆయన ముద్ద పప్పుకి తక్కువ.. గన్నేరు పప్పుకి ఎక్కువ అని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. గుడివాడ అమర్ నాథ్‌కు వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక దళిత మహిళ అయిన తనపై మంత్రి గుడివాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో వంగలపూడి అనిత విలేకరుల సమావేశం నిర్వహించారు. గుడివాడ అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రెస్‌ మీట్‌లోనే అనిత కోడి గుడ్లు జారవిడిచి పగలగొట్టారు.


వైఎస్ జగన్ గుడ్డు మంత్రికి హ్యాండ్ ఇచ్చారని అనిత అన్నారు. కోడి గుడ్డు మంత్రి పని అయిపోయిందని.. గుడివాడ నోటి దురద వల్లే ఆయనకు టికెట్ రాలేదని ఎద్దేవా చేశారు. తనకు టికెట్ వచ్చిందని.. గుడివాడ అమర్ నాథ్ కే జగన్ టికెట్ ఇవ్వలేదని సెటైర్లు వేశారు. ఐటీ మంత్రి అయి ఉండి గుడివాడ అమర్ ఏపీకి ఒక్క కంపెనీ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. దమ్ముంటే గుడివాడ తాను తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘గుడివాడ నీ స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? ఎక్కువ మాట్లాడితే.. మేము, జనసేన సైనికులు తరిమికొడతాం. నేను ఇప్పుడు మాట్లాడి.. అనవసరంగా గుడివాడ అమర్ నాథ్ స్థాయి పెంచుతున్నాం. పిడత పట్టుకొని.. మిడతలా ఉన్నారు గుడివాడ అమర్నాథ్ అంటూ అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.