Andhra Nadi AP Elections 2024: ఇచ్చాపురం: తెలుగుదేశం పార్టీ ఇచ్ఛాపురంలో ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా పసుపు జాతరే అని, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గంలో పసుపుజెండా ఎగురవేసి లోకేష్ కు కానుకగా ఇద్దామని శ్రీకాకుళం(Srikakulam) ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (RamMohan Naidu) ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం (Ichapuram)లో 'శంఖారావం' పేరిట నారా లోకేష్ చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రసంగించారు. రెడ్ బుక్ లో పేర్లున్న అధికారులు, నేతలు ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అని హెచ్చరికలు పంపారు. 


రాబోయే ఎన్నికలకు శంఖారావం ద్వారా యువనేత లోకేష్ దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నారు. రాష్ట్ర ప్రజలందరి గొంతును యువగళంగా మార్చుకుని లోకేష్ పాదయాత్ర చేశారని, తెలుగువారి గళం డిల్లీలో వినపడాలంటే తెలుగుదేశం పార్టీని ఘనవిజయంతో గెలిపించాలని ప్రజలను రామ్మోహన్ నాయుడు కోరారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇచ్ఛాపురంలో  ముగించాల్సి ఉన్నా, కొన్ని అవాంతరాల వల్ల రాలేకపోయారని చెప్పారు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్ఛాపురం వచ్చి నేడు ఈ గడ్డపై శంఖారావంతో లోకేష్ అడుగుపెట్టారని చెప్పారు.


సీఎం జగన్ రెడ్డి పాలన అంతానికి లోకేష్ శంఖారావం పూరించారని, ఈ శంఖారావం మనం కోసం, రైతులు, యువకులు, బడుగు, బలహీనవర్గాల కోసం అన్నారు. జగన్ రెడ్డిని నమ్మి రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని.. ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో గడిపిన జగన్ రెడ్డి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అని విమర్శించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే.. మీడియా ఏం అడుగుతుందోనని సీఎం జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ఎద్దేవా చేశారు. కానీ జగన్ రెడ్డి ఢిల్లీ వస్తే ఆ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా రాలేదన్నారు. జగన్ పని అయిపోయిందని, వైసీపీ నేతలకు కూడా తెలిసిపోయిందన్నారు. ఒకరు దుబాయి పారిపోయారు, మరికొందరు నియోజకవర్గాలకు పారిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


2014-19 మధ్య అనేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అనేక తుఫానులను ఎదుర్కొన్నాం, జగన్ రెడ్డిని ఓడించడం పెద్ద లెక్క కాదని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తిచేస్తామన్నారు. టీడీపీ అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉండే పార్టీ అని, పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తింది తామేనన్నారు. 
హోదాపై మాట తప్పిన జగన్!
25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామన్న జగన్ రెడ్డి మాట తప్పారని, అందుకే ప్రజలవద్దకు వెళ్లి ఓట్లడిగే దమ్ము లేక భయపెట్టి ఓట్లు వేయించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రకృతి విపత్తులకే భయపడని మేం... జగన్ ఉడత ఊపులకు భయపడతామా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టిడిపి హయాంలో కోట్లాదిరూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, రైతులకు సాగునీటి కాల్వల కోసం రూ.4కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెప్పారు.


రాబోతున్న కాలంలో ఇచ్చాపురం నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టాలంటే టిడిపిని గెలిపించాలన్నారు. అయిదేళ్లలో జగన్ సర్కార్.. కెనాల్స్ లో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని విమర్శించారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రత్యేక హోదా తెస్తానంటే నమ్మి.. ఎంపీలను గెలిపిస్తే ముఖం చాటేసిన ఘనుడు సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు.