TDP News: ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీలక నేతల్లో ఒకరైన గంటా శ్రీనివాసరావు పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి ఎన్నికకు కొత్త నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిడం, విజయం సాధించడం గంటా శ్రీనివాసరావుకు పరిపాటిగా మారింది. రానున్న ఎన్నికల్లో కూడా కొత్త అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గంటా పోటీ చేయనున్న నియోజకవర్గం ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది.


గడిచిన ఎన్నికల్లో విశాఖ నార్త్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సైలెంట్‌ అయిపోయారు. ఒకొనొక దశలో అధికార వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా వైసీపీ కీలక నేతలతో చర్చలు జరిపారు. విజయసాయిరెడ్డి, ఇతర ముఖ్యులతో ఆయన సమావేశమైనట్టు ప్రచారం జరిగింది. గంటా రాకను మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తీవ్రంగా వ్యతిరేకించారని, అందుకే పార్టీలో చేరిక నిలిచిపోయిందని చెబుతారు. కాలం గడిచింది. టీడీపీలోనే గంటా కొనసాగుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గంటా మరోసారి తాను అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు అనుగుణంగా ఉన్న నియోజకవర్గాన్ని వెతికే పనిలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు. 


ప్రతిసారి కొత్త స్థానం నుంచే ఎన్నిక


వ్యాపార రీత్యా విశాఖకు వచ్చిన గంటా శ్రీనివాసరావు రాజకీయ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన గంటా 1999లో తొలిసారి అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తరువాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. ఆ తరువాత రాజకీయ సమీకరణాలు దృష్ట్యా జనసేనలోకి వెళ్లిన ఆయన.. అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో రాష్ట్ర విభజన, ఆ తువాత జరిగిన పరిణామాలతో మళ్లీ టీడీపీ గూటికి చేరిన గంటా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి కొత్త స్థానం ననుంచి బరిలోకి దిగారు. విశాఖ నగర పరిధిలోని విశాఖ నార్త్‌ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా నాలుగోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2009లో విజయం సాధించిన తరువాత గంటా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక తొలిసారిగా మంత్రిగా పని చేశారు. 2014 నుంచి 2019 మధ్య కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా వ్యవహరించారు. 


కొత్త స్థానం నుంచి బరిలోకి


ప్రతి ఎన్నికకు కొత్త స్థానం నుంచి బరిలోకి దిగడం, గెలవడం గంటా శ్రీనివాసరావుకు అలవాటుగా మారింది. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ఆరితేరిన గంటా ఓటమి అన్నది తెలియకుండా రాజకీయాలను నెరపుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికలను గంటా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడంతోపాటు 2029 నాటికి వారసుడికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేయాలని భావిస్తున్నారు. ఈసారి పోటీ చేయబోయే సీటు శాశ్వతంగా తనకు, వారుసుడికి రాజకీయంగా అండగా ఉండేలా చూసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇందుకోసం మూడు, నాలుగు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్న ఆయన అక్కడ సర్వేలు చేయించుకుంటున్నారు. వీటిలో ఒకటి భీమిలి కాగా, మరొకటి విజయనగరం జిల్లా నెల్లిమర్ల అని చెబుతున్నారు. అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో గంట ఎక్కడ మోగుతుందో