ప్రభుత్వం ఛార్జీల పేరుతో ప్రజలపై భారం వేస్తుందని ఆరోపిస్తూ తెలుగుదేశం చేపట్టే బాదుడే బాదుడు కార్యక్రమంలో అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. శ్రీకాకుళంజిల్లా ఆమదాల వలసలో జరిగిన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.


ప్రజలందర్నీ పలకరించి పన్నుల పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ముద్రించిన కరపత్రాన్ని వాళ్లకు అందించారు చంద్రబాబు. పొందూరు మండలం దళ్లవలసలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్‌ పేరుతో మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్... ఇప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపరడ్డారు. 


వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని చూసి జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 151 సీట్లు వచ్చాక జగన్‌కు అహంకారం పెరిగిపోయిందని తాము ఏం చేసినా చెల్లుతుందన్న భావనలో వైసీపీ నేతలు ఉన్నారన్నారు. 151 సీట్లు తెచ్చుకున్న జగన్ బాదుడు ఎలా ఉందని ప్రజలను ప్రశ్నించారు చంద్రబాబు. నిత్యావసర సరకులు ధరలు ఎలా ఉన్నాయని అడిగారు. ఇదేంటని ప్రశ్నిస్తున్న వారిపై కూడా దాడులు చేస్తున్నారని వివరించారు.


ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నిస్తున్న తన ఇంటిపై దాడి చేశారని టీడీపీ లీడర్లపై దాడులు చేస్తున్నారని ఎదురు కేసులు పెడుతున్నారని అన్నారు చంద్రబాబు. చివరకు దేవాలయంలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేశారని ప్రజలకు వివరించారు చంద్రబాబు. నిండు సభలో తన ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడి అవమాన పరిచారని... అందుకే కౌరవ సభలాంటి ఆ సభకు వెళ్లబోనని పునరుద్ఘాటించారు. 


తనను తిట్టి బెదిరిస్తామంటే తాను ఎప్పటికీ భయపడబోనన్నారు చంద్రబాబు. తప్పలు చేసిన వారిని ప్రజల ముందు నిలబెడాతామన్నారు. దోషులగా నిరూపించి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేస్తామని హెచ్చించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని ఇక వైసీపీ లీడర్లకు గుణపాఠం తప్పదన్ననారు. 


జగన్... కరోనా కంటే భయంకరమైన వ్యక్తిగా అభివర్ణించారు చంద్రబాబు. జగన్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందన్నారు. నిత్యావసర సరకులు భారీగా పెరిగాయన్నారు. వంట నూనె, గోధుమ పిండి, గ్యాస్ ధరలు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయన్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా సరిగ్గా ఉంటుందా అని ప్రశ్నిచారు. ప్రజల నుంచి లేదూ అని సమాధానం వచ్చింది. టీడీపీ హయాంలో కరెంటు పోయేది కాదని.. ఇప్పుడు కరెంట్ ఉండటమే లేదన్నారు. తెలుగుదేశం హయాంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో నిరంతరం విద్యుత్ సరఫరా చేశామని ఇప్పుడు ఆ ముందు చూపులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు బాదేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. ఈనెల విద్యుత్ ఛార్జీలు బిల్లులు బాదుడే బాదుడని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరు తగ్గించమని కేంద్రం సూచిస్తే... జగన్ రూపాయి కూడా తగ్గించలేదని టీడీపీ హయాంలో పెట్రోల్ పై 5 రూపాయలు తగ్గించామని గుర్తు చేశారు. ఉన్న ధరలు చాలవన్నట్టు చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సొంతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. టాయిలెట్స్‌పై కూడా పన్ను వేసిన ఘతన ఈయనదే అన్నారు. 


మద్యనిషేధం పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్... కల్తీ బ్రాండ్‌లు తీసుకొచ్చారని విమర్శించారు చంద్రబాబు. ఇప్పుడు ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్స్ దేశంలో వేరే చోట కనిపించవన్నారు. అన్నీ కూడా జే బ్రాండ్స్‌గా తెలిపారు. ఈ జే బ్రాండ్స్ వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుందన్నారు. మద్య నిషేధం పక్కన పెట్టేసి యువతను మద్యానికి బానిసలుగా మార్చేస్తున్నారని ఆరోపించారు. 


1000 రూపాయలు దాటితే మొత్తం ఆరోగ్య ఖర్చులు భరిస్తామన్న జగన్... ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు చంద్రబాబు. టిడిపి హయాంలో ఏజెన్సీల్లో ఫీడర్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేసామని గుర్తు చేశారు. టిడిపి హయాంలో కుటుంబ ఖర్చు ఎంత...ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో బేరీజు వేసుకోవాలని సూచించారు చంద్రబాబు. తేడా లేకపోతే ఓట్లు అడగబోనన్నారు. 


సిండికేట్ పెట్టి భారతి సిమెంట్‌కి లాభాలు ఆర్జించి పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. పేదోడు సిమెంట్ కొనలేని పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు తెచ్చారని ఆ అప్పు ఏం చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ 8 లక్షల కోట్లు ఎవరు కడతారని నిలదీశారు. జగన్ కారణంగా రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 


సీపీఎస్ పేరుతో ఉద్యోగులను మోసం చేశారన్న చంద్రబాబు... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు కోసం వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లకు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. మోటర్లకు మీటర్లు పెడితే అవి రైతుల మెడకు ఉరితాళ్లు అవుతాయని అభిప్రాయపడ్డారు. మీటర్లకు వ్యతిరేకంగా పోరడాదామంటూ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 


నాడు నేడు పేరుతో స్కూల్ బిల్డింగులకు రంగులు వేసి డబ్బులు కొట్టేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. ఇలాంటి వ్యక్తులు పరీక్ష పత్రాలను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. టెన్త్ పేపర్ లీకేజ్‌కి బాధ్యత వహించి జగన్ రాజీనామా చేస్తారా...లేక బొత్స చేస్తారా... అని ప్రశ్నించారు. 


రాష్ట్రం మొత్తం గంజాయి,డ్రగ్స్ సరఫరా పెరిగిపోయిందన్న చంద్రబాబు.. వాటి ఫలితంగానే అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డకు రక్షణ లేదన్నారు. ఇలాంటి అత్యాచారాలు రొటీన్‌గా జరుగుతాయని హోం మంత్రి చెబుతున్నారని అలాంటిప్పుడు వీళ్లంతా ఎందుకు ఉన్నట్టో చెప్పాలని నిలదీశారు చంద్రబాబు.