టెక్కలి రాజకీయం మరింత హీటెక్కింది. ఓవైపు వైసీపీ వ్యూహాలు రచిస్తోంటే... మరోవైపు టీడీపీ ప్రతివ్యూహాలను పన్నుతోంది. ఇరు పార్టీల లెక్కలు, ప్రచారాలతో జిల్లాలోనే ఇదో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. అక్కడ కింజరాపు కుటుంబాన్ని ఓడించి చరిత్ర సృష్టించాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. జగన్ ఎత్తులను చిత్తు చేస్తూ మరోసారి సత్తా చాటాలని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్రై చేస్తున్నారు. 
వరుస చేరికలతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు అచ్చెన్న. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటున్న అచ్చెన్న... నియోజకవర్గంలోని 4 మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. అచ్చెన్నాయుడిని టెక్కలిలో నియంత్రించేందుకు అధికార పార్టీ ఎత్తుల పై ఎత్తులు వేస్తుంది. దీంతో టెక్కలిని రాజకీయాలు ఆసక్తిగా మారాయి. 


నిమ్మాడలో అచ్చెన్న మకాం


అచ్చెన్నాయుడికి దీటైన అభ్యర్థిగా అధికారిని బరిలో దింపుతోంది. కింజరాపు కుటుంబాన్ని ఓడిస్తామంటూ వైసీపీ చెబుతోంది. వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉందా పార్టీ. మొదటి నుంచి వైసీపీని అచ్చెన్న ఎదురిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం విధానాలపైనా అసెంబ్లీలో, బయట పోరాడుతూనే ఉన్నారు. ఇదే ధీమాతో ఆయన వచ్చే ఎన్నికల్లో ఖాయమనే వాదన గట్టిగా వినిపిస్తున్నారు.  


నాలుగు మండలాల నేతలతో మంతనాలు


విజయం సాధించేందుకు అచ్చెన్న వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. టెక్కలినియోజకవర్గం పరిధిలోని టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలలోవిస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో చేరికలపై టీడీపీ దృష్టి పెట్టింది. వైసీపీ అసమ్మతి నేతలంతా సైకిల్ ఎక్కుతున్నారు. ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలు అచ్చెన్న నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. 


వైసీపీకి పట్టుకున్న గ్రామాలపై ఫోకస్ 


వైసీపీకి పట్టున్న గ్రామాల నుంచి చేరికలను టీడీపీ ప్రోత్సహిస్తోంది. కొత్తవారు, ఇది వరకూ పార్టీని వీడిన వళ్లంతా తిరిగి వస్తున్నారు. ఇది పార్టీలో జోష్ పెంచుతోంది. ఇదే తమ విజయానికి కారణవుతుందని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. టెక్కలిలో 4 మండలాల్లో కూడా దీటైన నాయకులు ఉన్నారు. వారంతా రానున్న ఎన్నికల్లో బలం అవుతారని అంటున్నాయి. 


చంద్రబాబు సీఎ అయితే మేలని ప్రచారం


నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్న అచ్చెన్న.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ప్రజలకి భద్రత ఉంటుందని వివరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టెక్కలిలో భారీ మెజార్టీతో విజయం సాధించాలని టార్గెట్‌తో పని చేయాలంటున్నారు. 


2019లో జరిగిన ఎన్నికల్లో అచ్చెన్నాయుడు టెక్కలిలో ఎమ్మెల్యేగా గెలవగా శ్రీకాకుళం ఎంపిగా రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. వైసీపీ సునామీలో కూడా వీళ్లు బాబాయ్ అబ్బాయ్ గెలుపొంది సత్తా చాటారు. అయితే ఈసారి కచ్చితంగా వీళ్లను టార్గెట్ చేసుకొని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.