అనకాపల్లి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే వార్త జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. అచ్చుతాపురం మండలం ఎస్‌కే‌ఆర్ లాడ్జిలో జరిగిన ఘటనలో యువతి చనిపోయిందని.. యువకుడు కొనఊపిరితో ఉన్నట్టు ప్రచారం జరిగింది. 
దీనిపై విచారణ చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. అక్కడ జరిగింది ఆత్మహత్య కాదని హత్యేనని నిర్దారించారు. గాయాలతో ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం మొదట అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. యువతి మృతదేహాన్ని కూడా తొలుత ఎన్టీఆర్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎంఎల్‌సీ కేసు కావడంతో కేజీహెచ్‌ మార్చురీకి పంపారు. 


అచ్యుతాపురం సీఐ మురళీరావు, లాడ్జి సిబ్బంది చెప్పిన వివరాలు పరిశీలిస్తే ఇది హత్యేనని స్పష్టమవుతోంది. అచ్యుతాపురం జంక్షన్‌ నుంచి ఎలమంచిలి వైపు వెళ్లే రోడ్డులో ఎస్‌కేఆర్‌ లాడ్జి ఉంది. గాజువాక ప్రాంతం అరుణోదయ కాలనీకి చెందిన ఎం.శ్రీనివాసకుమార్‌ (28) అనే యువకుడు సోమవారం ఉదయం 10.40 గంటలకు లాడ్జికి వచ్చాడు. సిబ్బందికి తన ఆధార్‌ కార్డు చూపించి రూమ్‌ (303) అద్దెకు తీసుకున్నాడు. కొంతసేపటి తరువాత కూర్మన్నపాలేనికి చెందిన మహాలక్ష్మి (26 ఏళ్లు) అనే యువతి లాడ్జికి వచ్చి శ్రీనివాసకుమార్‌ వున్న గదిలోకి వెళ్లింది. 


సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వీరు ఉన్న గదిలో నుంచి పెద్దగా శబ్దాలు రావడాన్ని సిబ్బంది గమనించారు. బాబోయ్‌ చంపేస్తున్నాడు అంటూ యువతి కేకలు వేసింది. దీంతో సిబ్బంది వెంటనే రూమ్‌ వద్దకు వెళ్లి తలుపులు కొట్టారు. తాము దుస్తులు మార్చుకుంటున్నామని శ్రీనివాసకుమార్‌ చెప్పి తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది కిందకు వెళ్లి లాడ్జి మేనేజర్‌కు విషయం చెప్పారు. మేనేజర్‌పైకి వెళ్లి తలుపులు తట్టగా ఎటువంటి సమాధానం రాలేదు. 


ఏదో తేడాగా ఉందని గ్రహించిన లాడ్జ్ మేనేజర్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మురళీరావు, సిబ్బంది వచ్చి గది తలుపులు పగలగొట్టారు. అప్పటికే యువతి రక్తపు మడుగులో పడి ఉంది. శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. శ్రీనివాసకుమార్‌కు చేతిపైన, కడుపు మీద గాయాలు ఉన్నాయి. యువతిని పరిశీలించిన పోలీసులు అప్పటికే మృతిచెందినట్టు గుర్తించారు. గదిలో కూరగాయలు తరిగే కత్తిని గుర్తించారు. దీంతో యువతిని శ్రీనివాసకుమార్‌ హత్య చేసినట్టుగా భావించారు. 


మహాలక్ష్మి మృతదేహంతోపాటు గాయపడిన శ్రీనివాసకుమార్‌ను పోలీసులు అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసకుమార్‌కు ప్రాథమిక చికిత్స చేసి అనంతరం విశాఖ కేజీహెచ్‌కి రిఫర్‌ చేశారు. అతనితోపాటు మహాలక్ష్మి మృతదేహాన్ని కూడా విశాఖ తరలించారు. శ్రీనివాసకుమార్‌ ఆధార్‌ కార్డులోని చిరునామా ప్రకారం పోలీసులు విచారణ చేపట్టి కొంత సమాచారాన్ని సేకరించారు.


ప్రేమ పెళ్లి..విడిపోయిన జంట


గాజువాక ప్రాంతానికి చెందిన ఎం.శ్రీనివాసకుమార్‌, కూర్మన్నపాలెం వాసి మహాలక్ష్మి గతంలో ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. ఆమె రాంబిల్లి మండల కొప్పుగొండుపాలెం రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తోంది. అయితే ఇద్దరి మధ్య స్పర్థలు రావడంతో ఏడాది నుంచి విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం శ్రీనివాసకుమార్‌ అచ్యుతాపురం వచ్చి లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. మహాలక్ష్మి ఎన్ని గంటలకు లాడ్జికి వచ్చిందో సిబ్బంది చెప్పలేకపోతున్నారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఆమె వచ్చినట్టు ఎక్కడా నమోదుకాలేదు. కరెంటు సరఫరా నిలిచిపోయిన సమయంలో వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. 


శ్రీనివాస్‌కుమార్‌ ఏం చేస్తుంటాడు, ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది, మహాలక్ష్మిని అతను ఎందుకు హత్య చేశాడు? వంటి విషయాలను ఇరువురి కుటుంబ సభ్యులను విచారించిన తరువాత వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కిందకు ఈ కేసు వస్తుందని, అందువల్ల డీఎస్పీ దర్యాప్తు చేస్తారని సీఐ తెలిపారు.