సిక్కోలు రాజకీయాలు ఎప్పటకప్పుడు హాట్ హాట్‌గా మారుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోరు నువ్వానేనా అనేలా సాగుతున్న టైంలో అధికార పక్షంలోనే అసంతృప్తి కాస్త కలవర పెడుతోంది. జిల్లా వైసీపీలో వర్గపోరు కొన్నిచోట్ల చాపకింద నీరులా ఉంటే.. మరికొన్ని చోట్ల బహిరంగంగానే కనిపిస్తోంది. దీంతో అధికారంలో ఉన్నామనే ఆనందం పార్టీ జెండా మోసుకుతిరుగుతున్న శ్రేణుల్లో కనబడటం లేదన్న విమర్శ గట్టిగానే వినిపిస్తోంది. పార్టీనే నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు గుర్తింపు లేదన్న అసహనం చాలా మందిలో కనిపిస్తోంది. వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని వైసీపీలోని ఓ వర్గం చెబుతోంది. 


కృష్ణదాస్‌ సైలెంట్‌


డిప్యూటీ సీఎంగా పని చేసిన కృష్ణదాసు.. ఆయన సిగ్మెంటు వరకే పరిమితమయ్యేరనే విమర్శలు ఉన్నాయి. మంత్రి అప్పలరాజు పలాసకు, జడ్పీ ఛైర్పర్సన్ ఇచ్ఛాపురం సిగ్మంటుకే పరిమితమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాపార్టీ శ్రేణులను ఒకతాటిపైకి తెచ్చి సమస్యలు పరిష్కరించడంలోను, కార్యకర్తల అభిప్రాయలు తెలుసుకుని అండగా నిలవడంలో ఎవరూ ముందుకు రావడంలేదనే ఆరోపణ ఉంది. 


సవాళ్ల స్వాగతం


ఈ పరిస్థితుల్లో సోమవారం కొత్త టీంతో పార్టీ సమావేశం నిర్వహిస్తుండడం ఆహ్వానించడదగిన విషయమేనని క్యాడర్ అభిప్రాయపడుతోంది. ఈ సమావేశంలోనైనా కార్యకర్తలకు ఎలా అండగా నిలుస్తారోనన్న చర్చ జరుగుతోంది. మంగళవారం నుంచే గడపగడపకు వెళ్లే కార్యక్రమాన్ని అధికార పక్షం చేపట్టనుండడంతో ఈ సమావేశం కీలకంగా మారింది. వైసీపీ జిల్లా సమన్వయకర్త, జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖనేతలందరూ హాజరుకానున్నారు. 


వేరుకుంపట్ల టెన్షన్ 


సోమవారం ఉదయం సమీక్ష మండలి సమావేశంలో బొత్స పాల్గొంటారు. మధ్యాహ్నం పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. అనేక ప్రాంతాల్లో ఉన్న వర్గపోరుపై చర్చించి పరిస్థితులు చక్కదిద్దకపోతే రానున్న రోజులో కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షమైన టీడీపీ మైలేజీ ఎలా ఉన్న వైసీపీ ఇంట్లో వేరుకుంపట్లు లేకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. 


ఎచ్చెర్ల, టెక్కలి, పాతపట్నం, ఆముదాలవలస సిగ్మెంటులలో వర్గపోరు ముదురుతోంది. దీనిపై పార్టీ పెద్దలు అనేక పంచాయితీలు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో  విభేదాలు తొలగిపోలేదు. నాయకులు, ఎమ్మెల్యేలు, మధ్య సమన్వయం లేకపోగా ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్, నిన్నటి వరకు జిల్లా పార్టీ అధ్యక్షరాలుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వర్గీయులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ మధ్య బాహటంగా దువ్వాడ, తిలక్ వర్గీయులు రోడ్డెక్కి ఒకరినొకరు విమర్శించుకునే పరిస్థితి తెలిసిందే. ధర్మాన కృష్ణదాస్ జోక్యం చేసుకున్నా సద్దుమణగలేదు. చివరకు ముఖ్యమంత్రి పంచాయితీలో వారిద్దరిని కలిపారు. ఇది అమరావతికి లేక వారిద్దరికి పరిమిత తప్ప, క్షేత్రస్థాయిలో క్యాడర్ కలిసే పరిస్థితి కానరాడంలేదు. 


పాతపట్నం సిగ్మెంటులో స్థానిక ఎన్నికల నుంచి రాజుకున్న వర్గపోరు సమసి పోలేదు. అక్కడి ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడిని హిరమండలం జడ్పీటీసీగా బరిలోదించిన గెలిపించుకోలేకపోయారు. రాష్ట్రంలోనే ఆ సీటు టీడీపీ కైవసం చేసుకుంది. అలానే టీడీపీ మద్దతుతో అక్కడ ఎంపీపీ పదవీని దక్కించుకున్నారు. కొత్తూరు, మెళియాపుట్టిలో ఆమె బిఫారం ఇచ్చిన వారు కాకుండా వేరే వారిని బలపరిచి ఎన్నుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి కూడ కొత్తూరు వైస్ ఎంపీపీ తులసీకి ఎమ్మెల్యే మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా నాయకత్వం వారి మధ్య సయోధ్య కుదర్చలేదు. ఆమె కూడ పట్టించుకోలేదు. 


ఆముదాలవలస సిగ్మెంటులో కూడా స్పీకర్ తమ్మినేని సీతారాంకు వ్యతిరేకంగా ఓ కోటరీ ఏర్పడింది. ఇప్పటికే ఒకటి రెండు సార్లు ఆమదాలవలస, పొందూరు మండల నాయకులు సీతారాంకు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పర్చుకున్నారు. అక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ముసలం మొదలై గాలివానలా మారుతోంది. అలాగే ఎచ్చెర్ల సిగ్మెంటులో కూడ అక్కడి ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌పై తిరుగుబాటు ప్రకటించారు. ఎచ్చెర్ల రణస్థలం లావేరు మండలాలకు చెందిన కొందరు నాయకులు ఓ కూటమిగా ఏర్పడి ఎమ్మెల్యే పనితీరు బాగోలేదంటూ బహిరంగంగానే మీడియా ముందుకు వచ్చారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిగ్మెంటుకు కొత్తగా ఇన్చార్జీని నియమించాలని అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు. 2024లో ఆయనే అభ్యర్థి అయితే మద్దతివ్వం అంటూ తేల్చిచెబుతున్నారు. బల్లాడ జనార్దన్‌రెడ్డి, జరుగుబిల్లి శంకర్రావుతోపాటు మండలాల్లో మరికొందరు ముఖ్యనేతలు సీఎంకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 


మంత్రివర్గ విస్తరణ తర్వాత..


మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తారని పలువురు భావించారు. కొందరు ఎమ్మెల్యే పనితీరుపై సీఎం అసంతృప్తి చెందడమే కాకుండా రానున్న ఎన్నికల్లో ఎవరిఎవరిపై అసంతృప్తి ఉందో వారికి అపాయింట్మెంటు కూడ ఉండదని టాక్ వచ్చింది. తదుపరి పార్టీ అధ్యక్షులను మార్చారు. కిల్లి కృపారాణిని తప్పించి సీనియర్ నాయకుడైన ధర్మాన కృష్ణదాసుకు ఈ జిల్లా పార్టీ పగ్గాలు కట్టబెట్టారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ధర్మాన ప్రసాదరావు జిల్లా పార్టీని ఒంటిచేతిలో నడిపారు. ఆ పదేళ్లపాటు ఎక్కడ కూడ పార్టీలో సమస్యలు లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ఈసారి ఆయనను పూర్వవైభవం తీసుకువస్తారని కేడర్ బలంగా విశ్వసించారు. అయితే.. పార్టీ అధినేతగా ఆయన తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రులకు స్పష్టం చేశారు. జిల్లాలో మంత్రులుగా ధర్మాన, సీదిరి అప్పలరాజు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు ఉత్తరాంధ్ర బాధ్యతలను ప్రసాదరావు సమకాలికుడిగా బొత్స సత్తిబాబుకు అప్పగించారు. అయితే.. ఈ నేతలంతా ఒకచోట సమావేశమై పార్టీని, కార్యకర్తలకు భరోసా ఇస్తారంటే .. అనుమానమే అంటున్నారు కార్యకర్తలు. 


సోమవారం జిల్లాలో 2024-వైసీపీ కొత్తటీం ఆధ్వర్యంలో పార్టీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కేడర్ ఎదురు చూస్తోంది. అందిన సమాచారం మేరకు కొందరైతే నేతలను ప్రశ్నించేందుకు సమాయత్తమవుతున్నారు. మరికొందరు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించి, టార్గెట్ కాకూడదని చర్చిస్తున్నారు.


ప్రతిపక్షంలో పనులు చేయించగలిగాం


తాము ప్రతిపక్షంలో ఉండేటప్పుడే తమకు నమ్ముకున్న కార్యకర్తల పనులు అధికారులను నిలదీసి చేయించుకున్నామని కొందరు వాపోతున్నారు. మూడేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ అంతకంటే దారుణంగా తమ పరిస్థితి మారిందని ఆవేదన చెందుతున్నారు.. ఉపముఖ్యమంత్రి, మంత్రి, స్పీకర్, జిల్లా ఇన్చార్జి మంత్రి, చైర్మన్లు ఇలా ఎంతోమంది పదవుల్లో ఉన్నా కాళ్లు అరిగేలా తిరగడమే మిగిలింది తప్ప నమ్ముకున్న పార్టీ సైన్యాన్ని ఏమి చేయ పోతున్నామనే ఆవేదన వెంటాడుతుందంటున్నారు. కొందరు నాయకులు తిరగలేక ఆగిపోయారనే టాక్ ఉంది. జిల్లాపార్టీ కూడ ఒకటి రెండు సార్లు సమావేశాలు నిర్వహించారే తప్ప సిగ్మెంట్లు వారిగా కష్టసుఖాలు తెలుసుకోవడంలో అధిష్ఠానం మొగ్గు చూపకపోవడంపై అసంతృప్తి చెందుతున్నారు. 


పెళ్లి నాటి సంబరం యానాలకు ఉండదన్నట్టు


పెళ్లి నాటి సంబరం యానాలకు ఉండదన్న సామెతలా తమ పరిస్థితి మారిందని జిల్లాలో వైసీపి కార్యకర్తలు బాహాటంగా 
చర్చించుకుంటున్నారు. జిల్లాకు ప్రభుత్వపరంగా, పార్టీపరంగా పదవులకు కొరత లేనప్పటికి క్షేత్రస్థాయిలో నాయకులు ఆవేదన వినేవారేవరని ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వానికి గుర్తింపు వచ్చిందని నాయకులు ప్రసంగాలు ఆనందం కలిగిస్తున్నా రేపు ఎన్నికలలో తమ మాట ఎవరు వింటారని ప్రశ్నిస్తున్నారు. ఓటర్లతో సఖ్యత ఉంటేనే ఎన్నికల సమయంలో ఓటు అడగ్గలమని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్య మంత్రిగా జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజున తమలో ఉప్పొంగిన ఆనందం పాలపొంగులా మారకూడదని ఆశించిన మూడేళ్లు గడచిన అదే పరిస్థితి కనబడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తొలి రెండు మూడేళ్లు పార్టీ శ్రేణుల్లో సముద్రంలో కెరటాల్లా వెల్లువెరుస్తోంది. కాని ఈసారి మాత్రం అందుకు భిన్నంగా తమ పరిస్థితి మారిందని ఏ కార్యకర్తకు తట్టిన అదే మాట వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పది సిగ్మెంటులకుగాను ఇచ్చాపురం, టెక్కలి మినహా మిగిలిన 8 సిగ్మెంటులు ఫ్యాన్ గాలి స్పీడ్‌గా తిరిగింది. దీనికి తోడు ముఖ్యమంత్రి జగన్ జిల్లాలో ధర్మాన కృష్ణదాస్‌ను ఉపముఖ్యమంత్రిగా, ప్రభుత్వంలో కీలకమైన శాఖలు కట్టబెట్టారు. తొలిసారిగా పలాసకు సీదిరి అప్పలరాజును మంత్రి చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడ మూడు పదవులు జిల్లాకు వరించలేదు. రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో ఉపముఖ్యమంత్రి పదవీ తప్ప అదే పదవులను జిల్లాకు అందజేశారు. ఏ జిల్లాలో లేనివిధంగా చైర్మన్ పోస్టులు ఉన్నాయి. అంతటి ప్రాధాన్యతివ్వడంతో ఇక ఆ జిల్లాలో నిరంతరం కార్యకర్తల్లోను, పార్టీలో సంబరమే అనుకుంటే పొరపడినట్టేనని పలువురు పార్టీ సైనికులు వాపోతున్నారు. ఒక్కపని అంటే ఒక్కపని తాము అనుకున్నట్టుగా సాధించామంటే ఒట్టంటూ ఆవేదన చెందుతున్నారు.