ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టు మిలీషియా స‌భ్యులు 180 మంది పోలీసుల ముందు లొంగిపోయారు. ఏవోబీ (ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దు) లోని మల్కన్‌గిరి జిల్లా జోడంబో పోలీస్‌ స్టేష‌న్‌ పరిధిలోని జంత్రీ పంచాయ‌తీ ప‌రిధిలోని ధాకడ్‌ పదర్, డాబుగూడ, అర్లింగ్‌పడ గ్రామాలకు చెందిన మావోయిస్టు మిలీషియా స‌బ్యులు బీఎస్ ఎఫ్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిప‌రులు ఎదురు కాల్పులు, హ‌త్యల‌లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. ఇక‌పై మావోయిస్టు కార్యక‌లాపాల్లో పాల్గొన‌బోమ‌ని వారు ప్రతిజ్ఞ చేశారు. 


ఏవోబీ మల్కన్‌గిరి జిల్లాలో యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ జోరుగా సాగుతోంది. జిల్లా నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు బీఎస్ఎఫ్ జిల్లాకు వచ్చి ఆ తర్వాత మల్కన్‌గిరి జిల్లా రూపురేఖలను మార్చేసింది. క్రమంగా ఒక మావోయిస్టు కోటను బీఎస్ఎఫ్ బలగాలు ఆక్రమించుకున్నాయి. కొన్ని నెలల క్రితం జిల్లాలోని చివరి మావోల స్థావరాన్ని బీఎస్ఎఫ్ బలగాలు చేజిక్కించుకోవడంతో జంత్రి పంచాయతీ వాసులు మార్పును గమనిస్తున్నారు.


జూన్ 2న, పోలీసు డీజీ సునీల్ బన్సల్ స్వాభిమాన్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు 50 మావోయిస్టు సానుభూతిప‌రులు లొంగిపోగా, తాజాగా అదే పంచాయ‌తీలో 180 మంది మావోయిస్టు సానుభూతిప‌రులు లొంగిపోయారు. ఈ సంద‌ర్బంగా మావోయిస్టు దుస్తుల‌ను త‌గుల‌బెట్టారు. ఈ సంద‌ర్బంగా ‘‘మేము ఇకపై తప్పుడు వాగ్దానాలను నమ్మము, మేము ఇప్పుడు ప్రభుత్వ అభివృద్ధి ప్రవాహంలో చేరుతామ’’ని ప్రతిజ్ఞ చేశారు.