Pawan Kalyan Gajuwaka Varaahi Yatra: గాజువాకలో ఓడిపోయిన తనకు ప్రజలు ఇంత ఘన స్వాగతం పలకడంతో ఇక్కడ నిజంగా ఓటమి తెలియట్లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తనను ఓడించిన గాజువాక ప్రజల ముందుకు వెళితే ఆదరిస్తారా అని సందేహపడ్డానని, అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ఘన స్వాగతం పలికారని గుర్తుచేసుకున్నారు. 2019 ఎన్నికల్లో త్రికరణ శుద్ధిగా పనిచేశాను, ఈరోజు అదే ఉద్దేశంలో నా నియోజకవర్గానికి వచ్చాను అన్నారు. గాజువాకలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఓ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఓటమిని ఎలా తీసుకోవాలో తెయదన్నారు. ఇటీవల జగదాంబ సెంటర్ లో తాను ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. అంబేద్కర్, గాంధీ ఆశయాలు.. నేతాజీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.


వైఎస్ జగన్ లాంటి వ్యక్తి దోపిడీ చేస్తాడని తెలుసు, అయినా 151 సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చి ఆ వ్యక్తిని ప్రజలు గెలిపించారన్నారు. భవన నిర్మాణ కార్మికులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు, కానీ 3 నెలల్లోనే 30 మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. ఓసారి ఎయిర్ పోర్టుకు వస్తే ప్రజలు ఎక్కువ రాలేదని, కొంచెంసేపు ఎదురుచూద్దామని జనసేన నేతలు చెబితే.. తాను జనాలు వస్తారని రాజకీయాల్లోకి రాలేదన్నారు. మనం చేసే మంచి గుర్తించి వస్తారని దీమా వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి చూస్తే లక్షల మంది తనకోసం తరలిరావడం సంతోషాన్ని కలిగించిందని, రాజకీయ ఓనమాలు నేర్చుకున్నచోటుకు మళ్లీ వచ్చానన్నారు.


విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు వినిపిస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏపీకి చాలా కీలకమైనది. తెలంగాణకు చెందిన వారితో కలిపి మొత్తం 30కి పైగా బలిదానాలు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఎందరో అమరులై స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు అనే వ్యత్యాసం లేకుండా అంతా విశాఖ ఉక్కు ఎప్పటికీ ఆంధ్రుల హక్కు అని ప్రజలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గానీ, అమరావతిలోగానీ పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వారికి న్యాయం జరగాలన్నారు. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులు దేవాలయాల వద్ద బిక్షాటన చేసి బతికారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం జగన్ మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడరని, అలాంటప్పుడు నీకు రాజకీయాలు అవసరమా అని సెటైర్లు వేశారు.


పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కొందరు నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదన్నారు. ఎన్నో కష్టాల తరువాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనకు దక్కితే, సీఎం జగన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారని విమర్శించారు. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ లోనూ భారీగా సీట్లు వైసీపీకి మెజార్టీ అందిస్తే.. తమకు ప్రజల సమస్యలు పట్టవన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాకు ఎంపీ సీటు ఇచ్చి ఉంటే పార్లమెంట్ లో మా గళం విప్పి ప్రశ్నించేవాళ్లమన్నారు. కానీ వైజాగ్ ప్రజలు రౌడీ షీటర్ ను ఎన్నుకుంటే, ఆ రౌడీ ఎంపీ ప్రజల కోసం ఎందుకు నిలబడతారు. ఏపీకి ప్రత్యేక హోదా లాంటి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం రాజీపడిందని, తమ ప్రయోజనాలే ముఖ్యమని సెలైంట్ గా ఉన్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.