ప్రతీ ఏటా సింహాచలం వద్ద జరిగే గిరి ప్రదక్షిణ భక్తులకు ఎంతో ముఖ్యమైనది. విశాఖలో 32 కిలో మీటర్ల పొడవున వ్యాపించి ఉన్న సింహాచలం కొండ చుట్టూ భక్తులు ఎంతో  భక్తి శ్రద్దలతో కాలినడకన ప్రదక్షిణలు చేసే కార్యక్రమమే గిరి ప్రదక్షిణ. కరోనా కారణంగా గత రెండేళ్లుగా గిరి ప్రదక్షిణ రద్దు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా కాస్త తక్కువగా ఉన్నందున కొన్ని నిబంధనలతో గిరి ప్రదక్షిణకు అధికారులు అనుమతినిచ్చారు. మొత్తం కొండా చుట్టూ అంటే 32 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేసి వచ్చే భక్తులకు రేపు అంటే 13 వ తేదీన కొండపైన గల సింహాచలం క్షేత్ర ముఖ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తారు . 


భారీ ఏర్పాట్లు


ఈసారి గిరి ప్రదక్షిణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ మధ్యలో భక్తులు రెస్ట్ తీసుకోవడానికి 29 స్టాళ్లు, తాత్కాలిక వైద్య శిబిరాలు 133, టాయిలెట్స్ 300, పోలీసులు 2016, 108 వాహనాలు 7తో పాటు 30 ఉచిత బస్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు . భక్తుల కోసం లక్ష లడ్డూలను సిద్ధం చేశారు. అలాగే ఒకవేళ ఎవరైనా భక్తులు ఈ రోజే 32 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని కొండపైకి చేరుకుంటే వారి దర్శనానికి వీలుగా ఆలయాన్ని రాత్రి 9 గంటలవరకూ తెరచి ఉంచుతామని అధికారులు తెలిపారు. కొబ్బరి కాయలు కొట్టేందుకు ఏకంగా 30 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సచివాలయ, జీవీఎంసీ ఉద్యోగులతోపాటు భక్తుల సౌకర్యార్ధం 40కి పైగా స్వచ్చంద సంస్థల ప్రతినిధులు వాలంటీర్లుగా గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొండపై పరిస్థితిని ఆలయ ఈవో సూర్యకళ సహా ఇతర సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు . 


సింహాచలం రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు


గిరిప్రదక్షిణ సందర్భంగా సింహాచలం రూట్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వైజాగ్  కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు . గోపాలపట్నం నుంచి వచ్చే వాహనాలను పాత గోశాల నుంచి అనుమతించేది లేదని అన్నారు. సింహాచలానికి రెండో వైపు నుంచి వాహనాలకు అడవివరం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందువల్ల జోడుగుళ్ళపాలెం వద్ద   భక్తులను సముద్ర స్నానాలకు అనుమతించేది లేదని చెప్పారు. అయినప్పటికీ, లుంబినీ పార్క్, తెన్నేటి పార్క్ వద్ద సముద్ర స్నానాలు చేసే భక్తుల కోసం మూడు NDRF బృందాలతోపాటు మెరైన్ పోలీస్ సిబ్బందినీ, గజ ఈతగాళ్లను నియమించినట్టు కలెక్టర్ చెప్పారు