గ్రీన్‌ఫీల్డ్‌ సీ పోర్టు కారణంగా మూలపేట ఇకపై అభివృద్ధికి మూల స్తంభంగా మారుతుందని అభిప్రాయపడ్డారు సీఎం జగన్. అభివృద్ధికి సంబంధించి నాలుగు కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో  శ్రీకాకుళం ముఖచిత్రం మారిపోబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు జగన్. తమ పాలనలో మాత్రం పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌లకు శ్రీకారం చుట్టామని అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో మూలపేట మరో ముంబై, మద్రాస్‌ కాబోతుందన్నారు. ఈ పోర్టును 24 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. దీని కోసం రూ.4,362 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు వెల్లడించారు. పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 35వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. 


పోర్టు వస్తే పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయన్నారు సీఎం జగన్. అప్పుడు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. మత్స్యకారులు వలసలు పోకుండా ఉండేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ఈ పోర్టుతో మరో రెండు ఫిషింగ్‌ హార్బర్లను కూడా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. 






తాము అధికారంలోకి వచ్చేవరకు రాష్ట్రంలో నాలుగంటే నాలుగే పోర్టులు ఉండేవి... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు పోర్టులను నిర్మించతలపెట్టామన్నారు. గతంలో ఎప్పుడూ చూడనంత అభివృద్ధిని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని తెలియజేశారు జగన్. 


కాకుళం జిల్లాలోని సంతబొమ్మాళీ మండలంలో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.


అంతకుముందు సీఎం జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ లో మూలపాడుకు చేరుకున్నారు. తర్వాత సీఎం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల ఖర్చుతో మూలపేట పోర్టు పనులు చేపడుతున్నారు. 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్‌ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వాడుకొనేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని భావిస్తున్నారు. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 


ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan Srikakulam Tour) శంకుస్థాపన చేశారు.