Ayyannapatrudu: ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై ఏపీ అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఖండించారు. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన, ఏపీ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. తెలుగు వారంతా ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై వైకాపా నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నారు. 


లోకేష్, ఉమా మహేశ్వరి గొడవ పడ్డారంటూ పోస్టులు..


జగన్ వ్యతిరేకుల అందరన్నీ బూతులు తిట్టడమే దేవందర్ పని అంటూ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకే లక్షల జీతం ఇచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టారని బుధవారం నర్సీపట్నం నుంచి ఆన్ లైన్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో రోడ్డు నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నెంబర్లలోని 6.73 ఎకరాల భూమి గురించి ఉమా మహేశ్వరితో లోకేష్ గొడవ పడ్డారని, ఆ మనస్తాపంతోనే ఆమె చనిపోయారని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఇదేం శవ రాజకీయం జగన్ రెడ్డీ..!


ఇదే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందామని ఆ సర్వే నెబంబర్లను గురించి తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ధరణి పోర్టల్ లో చూస్తే అసలు ఆ సర్వే నంబర్లే తప్పని తేలిందని చెప్పారు. ఇదేం శవ రాజకీయం జగన్ రెడ్డీ.. మీ పార్టీని మీరు నడిపించుకోండి కానీ ఇలా అందర్నీ బూతులు తిట్టడం ఏంటి, ఇలాంటివి మానుకోండంటూ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇంకోసారి ఇలా ఇష్ట వచ్చినట్లుగా మాట్లాడుతూ, తిడ్తూ ఉంటే ఊరుకునేది లేదని చెప్పారు.


లక్ష్మీ పార్వతీ నువ్వు నోరు అదుపులో పెట్టుకో..!


అంతే కాకుండా ఎన్టీఆర్ కుమార్తె మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్లపై కూడా అయ్యన్న పాత్రుడు స్పందించారు. ఏవో కారణాల వల్ల ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే ఇంత రచ్చ చేయడం అవసరమా అంటూ ప్రశ్నించారు. ఉమా మహేశ్వరి మరణాన్ని వైకాపా నేతలు లక్ష్మీ పార్వతి, విజయ సాయి రెడ్డి రాజకీయం చేయడం అత్యంత నీచమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం అన్నారు. వారి మాటలు, ప్రవర్తనను ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు. ఇకనైనా వైకాపా నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే  ఊరుకునేది లేదంటూ నాదెండ్ల బ్రహ్మం హెచ్చరించారు.