ఒడిశా రైలు దుర్ఘటన గురించి ముఖ్యమంత్రి జగన్‌ నిరంతరం సమీక్ష చేస్తున్నారని, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు, అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వర్రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులకు వెల్లడించారు.


పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్‌ అధికారులతో కూడిన బృందాన్ని ఒడిశాకు సీఎం పంపించారని బొత్స తెలిపారు. కోరమాండల్‌ సహా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఏపీలో ఈ రైళ్లు ఆగే ఆయా స్టేషన్ల నుంచి సమాచారాన్ని సేకరించామని, మొత్తం కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామని చెప్పారు. వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు ఐదుగురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నారని వివరించారు.


‘‘వీరందరి ఫోన్‌ నంబర్లకు ఫోన్లుచేసి వారిని ట్రేస్‌ చేస్తున్నాం. 267 మంది సురక్షితంగా ఉన్నారని తేలింది. 20 మందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. 82 మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నట్టు వెల్లడైంది. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ చేయడమో జరిగింది. ఈ 113 మంది వివరాలను సేకరించడానికి ముమ్మరంగా చర్యలుచేపడుతున్నాం. అలాగే హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నారు. విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8, నెల్లూరు నుంచి ముగ్గురు ఉన్నారు.


ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారు. స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారు. 10 మంది ట్రైను ఎక్కలేదు. 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ అవడమో జరిగింది. వీరి వివరాలను సేకరించడంపై దృష్టిపెట్టాం. ఇచ్ఛాపురం నుంచి ఒంగోలు వరకూ కూడా ఆస్పత్రులను అలర్ట్‌ చేశాం. గాయపడ్డవారు ఎవరు వచ్చినా.. వారికి చికిత్స అందించాలని ఆదేశాలు ఇచ్చాం. విశాఖకు చేరుకున్న గాయపడ్డ ప్రయాణికులు ఇద్దరిని వెంటనే సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చేర్పించాం. వీరిలో ఒకరి తలకు, మరికొరికి వెన్నుపూసకు గాయం అయ్యింది.’’


మెరుగైన వైద్యం అందిస్తున్నాం :బొత్స
‘‘ఒడిశాకు 108 అంబులెన్స్‌లు 25, ప్రయివేటు అంబులెన్స్‌లు మరికొన్ని మొత్తంగా 50 అంబులెన్స్‌లు పంపించాం. ఇవికాకుండా ఎమర్జెన్సీ కార్యకలాపాలకోసం ఒక ఛాపర్‌ను కూడా సిద్ధంచేశాం. అవసరమైతే క్షతగాత్రులను ఎయిర్‌లిఫ్ట్ చేస్తాం. నేవీ సహకారాం కూడా తీసుకుంటున్నాం. ఏపీకి చెందిన ప్రయాణికులు చనిపోయారని నిర్ధారిత సమాచారం ఏమీ లేదు. సహాయక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి.. ఇంకా ఏమీ నిర్ధారించలేం. కానీ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి టైం టు టైం సమీక్ష చేస్తున్నారు. పేషెంట్లను అవసరమైతే భువనేశ్వర్‌ అపోలోలో చేర్పించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు అపోలో ఆస్పత్రితో మాట్లాడాం. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎవరైనా తమ వారి సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకు అందించాలని కోరుతున్నాం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.