Roja Fires On Pawan Kalyan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఎంత కడుపు మంట ఉందో ఆయన మాటల్లోనే అర్ధం అవుతుందని ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. టిడ్కో ఇళ్లను మంత్రి ఆర్.కే.రోజా సోమవారం పరిశీలించారు. అనంతరం ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ లపై తీవ్ర స్థాయిలో ఆమె మండిపడ్డారు. తన కన్నా చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు ప్రజల్లో అభిమానం పెరిగిపోతుందని, అందుకే "భూమి పేలి పోవాలి ఋషికొండ దాంట్లోకి వెళ్లిపోవాలి అందులో జగన్ సమాధి కావాలని" పవన్ కళ్యాణ్ మాటల్లో కడుపు మంట అర్థమవుతుందన్నారు. జీరో అని నువ్వే చెప్పుకున్నావు, సినిమాలు చేసుకుంటే డబ్బులైనా వస్తాయని.. కానీ బయటకు వచ్చి నోటికొచ్చింది వాగితే రాళ్లతో కొడతారంటూ హెచ్చరించారు.


పవన్ కళ్యాణ్ ఇలా కడుపు మంటతో అరిచి అరిచి గుండె పగిలి ఎక్కడ చచ్చిపోతాడేమో అనే భయం వేస్తోందంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేసి ఆరోగ్యశ్రీ కింద కడుపు మంటల కళ్యాణ్ ను ఆసుపత్రుల్లో చేర్పించి ఆయన కడుపు మంటను తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. అప్పటికి పవన్ కళ్యాణ్ కు కడుపు మంట చల్లారకపోతే హైదరాబాదులోని ఎర్రగడ్డ హాస్పిటల్ చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని ఆమె ఎద్దేవా చేశారు. ఏపీ టూరిజం మంత్రిగా ఋషికొండపై ఏపీ టూరిజం భూములు 69 ఎకరాలు ఉందని, అందులో 9.88 ఎకరాలకు అనుమతులు తీసుకుని, అందులో 2.77 ఎకరాల్లో భవన నిర్మాణం చేస్తున్నట్లు ఆమె వివరించారు. జీ ప్లస్ వన్ కింద పర్మిషన్ ఇస్తే నాలుగు భవనాలను మాత్రమే నిర్మాణం చేస్తున్నామన్నారు. 
ఈ రోజు 140 చెట్లను తొలగించడానికి పర్మిషన్ తీసుకొని, కన్ స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రస్తుతం 13 వేల చెట్లు అక్కడ నాటాడమని ఆమె తెలియజేశారు.. రిషికొండ పైన ఏమున్నా కనిపించని చంద్రబాబు, పవన్ కు టూరిజం శాఖకు సంబంధించిన హరిత రిసార్ట్స్ ను తిరిగి నిర్మిస్తుంటే, ఎందుకు కడుపుమంటతో విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుందని, కడుపు మంటతో చంద్రబాబు పవన్ లు విషం చిమ్ముతున్నట్లు చెప్పారు. విశాఖ బ్రాండ్ ను చెడిపేందుకే చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ కు వారం రోజులపాటు షెడ్యూల్ ఇచ్చి విశాఖ నుంచి విమర్శలు చేయిస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. 


సీఎం జగన్ పులివెందులకు పారిపోవాల్సిన అవసరం లేదని, ఆయనకు చెప్పుకునేందుకు సొంత నియోజకవర్గం ఉందని, కానీ పవన్ కు ఏపీలో చెప్పుకునేందుకు ఓ ఇళ్లు గానీ, సొంత నియోజకవర్గం గానీ లేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ప్రాంతాల మధ్య విద్వేషాలు రాకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం జరిగిందని వివరించారు. అమరావతిలో వీళ్ళ బినామీ భూముల రేట్లు పడిపోతాయనే భయంతో వైజాగ్ మీద ఋషికొండ మీద విషం చిమ్ముతున్న రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని, అందుకే జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. 


భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాలేడని ఆమె ఎద్దేవా చేశారు. ఎవరైనా పార్టీ పెడితే ప్రజల క్షేమం కోసం పోరాడుతారే గానీ, చంద్రబాబు గెలిపించండి నాకు సిఎం అయ్యే అర్హత లేదని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నీకు నువ్వే జీరో అని చెప్పుకోవడం అవమానకరం అన్నారు. ఇప్పటికైనా పవన్ బుద్ది తెచ్చుకుని, సినిమాలు చేసుకుంటే కాస్త డబ్బులైన వస్తాయని, ఇలా ఎండలో తిరుగుతూ పచ్చి వాగుడు వాగితే ప్రజలు రాళ్ళతో కొడుతారంటూ ఆర్.కే.రోజా హెచ్చరించారు.