CM Jagan Vizag Visit: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 11వ తేదీ అంటే గురువారం రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగానే వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. గురువారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయలు దేరుతారు. అలాగే 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం ఫోటో సెషన్, రేడియేషన్ ఎక్విప్మెంట్ వీక్షణ ఉంటుంది. తర్వాత 5.35 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు.


ఆ తర్వాత అక్కడి నుంచి బయలు దేరి 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ పీఎం ఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హారియర్ యుద్ధ విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. దీంతో పాటు అక్కడి నుంచే రామ్ నగర్ లోని పీఎం ఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఏరీనాను ప్రారంభిస్తారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఎమ్మెల్యే గొల్ల బూబురావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమై 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.   


మే 24న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టూర్


తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడినట్లు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఇదే నెల 24వ తేదీన సీఎం జగన్ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు. అలాగే ' వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని మే 24వ తేదీన కొవ్వూరులో నిర్వహిస్తామని మంత్రి తానేటి వనిత వివరించారు. 


జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం..


ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందని, వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతీ మంచి పనికి కూడా మాకు ఎంతిస్తారనే గుణం టీడీపీది అని విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని ఆరోపించారు. అలాగే గత ప్రభుత్వ పాలనలో అడుగడుగునా వివక్ష ఉండేదని, తన పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలని, వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రోజే శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు.