AP Mlc Elections :ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. నిన్నటి వరకూ దొంగ ఓట్ల కలకలం రేగగా, నేడు విశాఖ డబ్బులు పంపిణీ చేస్తూ ఓ వ్కక్తి పట్టుబడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లను మభ్య పెట్టడానికి వైసీపీ డబ్బుల పంపిణీ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. విశాఖ కృష్ణా కాలేజీ సమీపంలో వైసీపీ కార్యకర్తగా చెబుతున్న వ్యక్తి డబ్బులు పంపిణీ చేస్తుండగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో  రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ఓ వ్యక్తి వద్ద 87,000 నగదును అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసకున్న రెవెన్యూ అధికారులు ఆరాతీస్తున్నారు.  


వైసీపీ అభ్యర్థి తరఫున డబ్బులు పంపిణీ! 


ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సుధాకర్ తరఫున ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతూ వైసీపీ కార్యకర్త, ఎంపీ అనుచరుడు ఈశ్వర్ రావును కొందరు వ్యక్తులు పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న  87 వేల నగదును వచ్చి పంచుతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్థానికులు. వార్డు నెం 16లోని బూత్ నెం : 232 లో  డబ్బులు పంచుతుండగా పట్టికున్నామని స్థానికులు అంటున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.  దీంతో అక్కడి చేరుకున్న అధికారులు, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎంపీకి సంబంధించిన నిర్మాణ సంస్థలో ఈశ్వర్ రావు ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.  


17 మందికి నగదు పంపణీ! 


విశాఖ హెచ్‌బీ కాలనీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. డబ్బులు పంచుతున్న వైసీపీ ప్రతినిధులను పీడీఎఫ్ కార్యకర్తలు, స్థానికులు అడ్డుకున్నారు. వాలంటీర్ ఇచ్చిన జాబితా ప్రకారం డబ్బులు పంచుతున్నట్లు గుర్తింపు – విశాఖ పాతనగరానికి చెందిన ఈశ్వరరావు 17 మందికి నగదు పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించారు. వైసీపీ ప్రతినిధుల వద్ద డబ్బు లాక్కుని అధికారులకు ఫిర్యాదు చేశారు పీడీఎఫ్ నాయకులు. నిందితుడి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు అధికారులు. 






ఓటర్లకు నోట్లు పంచుతూ దొరికిన వైసీపీ కార్యకర్తలు 


తిరుపతి యశోద నగర్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ వైసీపీ కార్యకర్తలు దొరికిపోయారు. యశోధ నగర్ లోని ఓటర్లకు ఆదివారం మధ్యాహ్నం ఇంటింటికి వెళ్ళి ఓటర్లకు డబ్బులు పంచిన వైసీపీ‌ కార్యకర్తలు చైతన్య, అరుణ్ లను సీపీఎం కార్యకర్తలు పట్టుకున్నారు. ఓటర్లకు నగదు పంచుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తల వెంట స్థానిక వాంటీర్లు సైతం ఉండడం గమనార్హం. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ వైసీపీ నాయకులపై సీపీఎం కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైసీపీ కార్యకర్యలను అదుపులోకి తీసుకుని కొంత సమయం అనంతరం వారిని విడిచిపెట్టారు పోలీసులు.  



దొంగ ఓట్ల కలకలం 


ఆంధ్రప్రదేశ్‌లో టీచర్స్, గ్రాడ్యూయేట్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 13న జరుగుతున్నాయి. రెండు టీచర్స్, మూడు గ్రాడ్యూయేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం రేగింది. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పెద్ద ఎత్తున ఫేక్ ఓట్ల ఆరోపణలు వస్తున్నాయి. విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ నకిలీ ఓటర్ల విషయాన్ని సాక్ష్యాలతో సహా మీడియా ముందుకు వస్తున్నాయి. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఈ దొంగ ఓట్లపై విస్తృతంగా ఉద్యమం చేస్తున్నాయి. 


తిరుపతిలో వేలల్లో దొంగ ఓట్లు !


తిరుపతిలో వేలల్లో దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ , బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒకే వ్యక్తికి అనేక మంది తండ్రుల పేర్లు పెట్టి ఓటు నమోదు చేయడం.. ఓకే మహిళకు అనేక మంది భర్తల పేర్లు పెట్టి ఓట్లు నమోదు చేయడం వంటివి బయటపడ్డాయి. అలాగే వైఎస్ఆర్‌సీపీ ఆఫీస్ తో పాటు అసలు పట్టభద్రులే లేని ఇంటి నెంబర్‌తో పెద్ద ఎత్తున ఓట్లు నమోదు కావడం  సంచలనంగా మారింది. ఆధారాలతో వీటిని విపక్ష నేతలు బయట పెడుతున్నారు. అడ్డదారుల్లో గెలిచేందుకు అధికార పార్టీ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సాయంతో ఇలాంటి దొంగ ఓట్లను సృష్టించిందన్న ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణల విషయంలో ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తాను న్యాయపోరాటం అయినా చేస్తామని విపక్ష పార్టీలు అంటున్నాయి.