CM Jagan Mohan Reddy : పల్నాడు జిల్లా వినుకొండ ప‌ర్యట‌న‌లో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న పలువురు సీఎంను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. బాధితుల స్థితిని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి అప్పటికప్పుడు సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్ల క్రితం ఇల్లు కాలిపోయి ఉండటానికి గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినుకొండకు చెందిన మస్తానమ్మ ముఖ్యమంత్రిని  కలిసి తన సమస్యను విన్నవించుకోవడంతో వెంటనే సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు సీఎం. బాపట్ల జిల్లాకు చెందిన నారాయణస్వామి.. రెండో తరగతి చదువుతున్న తన కుమారుడు  తేజ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, తన కుమారుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్థిక స్థోమత లేదని సీఎంకు విన్నవించుకున్నారు. వారి బాధను అర్థం చేసుకున్న సీఎం..నారాయణస్వామికి తక్షణ సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్‌ లోతేటి వారికి అవసరమైన సాయం చేశారు. 






సీఎంఆర్ఎఫ్ నిధులు అందేలా చర్యలు 


ముఖ్యమంత్రి ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి, స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి మస్తానమ్మకు వినుకొండ పట్టణ పరిధిలో అనువైన చోట ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి నగదు తక్షణ సహాయంగా రూ. 50,000 అందించారు. అలాగే తేజకు తక్షణ సహాయంగా రూ. 1 లక్ష అందించారు. చికిత్సకు అవసరమైన మిగిలిన సాయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్‌తో చర్చించి సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.  సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. తమ సమస్యలపై తక్షణమే స్పందించి సాయం అందించారన్నారు. 


బాలుడికి వైద్య ఖర్చులు సాయం  


డిసెంబర్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో పారుమంచాల గ్రామానికి చెందిన మహిళ జయమ్మ సీఎం జగన్ ను కలిసి, తన కుమారుడు యోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, డయాలసిస్‌ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్లు వివరించింది. తన కుమారుడికి అవసరమైన వైద్య సహాయం, పెన్షన్‌ మంజూరు చేయాలని సీఎం జగన్ ను అభ్యర్ధించింది.  దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే బాలుడి వైద్యం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్  మనజీర్‌ జిలానీ శామూన్‌ ను ఆదేశించారు. బాలుడి వైద్య ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని కన్నీటిపర్యంతమైన ఆ తల్లికి హామీ ఇచ్చారు జగన్.