Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసింది. వారంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఇలా వస్తున్న ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదనతో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరికొందరు అధికారులే షాక్ తినేలా ప్రవర్తిస్తున్నారు.  

కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌కు ఓ యువతి వచ్చింది. తన భూమి కబ్జా అయిందని చెప్పింది. భువనేశ్వరి అనే యువతి తన సమస్యను వివరించే అర్జీతోపాటు తన చెవిదుద్దులను కూడా అధికారుల ముందు పెట్టింది. దీంతో అధికారులు షాక్ తిన్నారు. తన భూమి కబ్జాకు గురి అయిందని వాపోయారు. తన భూమి వివాదం కోర్టులో ఉండగానే కొందరు వ్యక్తులు వచ్చి కబ్జా చేశారని. అక్కడ ఇల్లు నిర్మిస్తున్నారని తెలిపింది. 

భూ వివాదంపై స్థానిక నాయకత్వాన్ని అధికారులను కలిసినా ఎవరూ న్యాయం చేయడం లేదని ఆ యువతి బోరుమన్నారు. డబ్బులు ఉన్న వారికే న్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఉన్నతాధికారులైనా న్యాయం చేస్తారనే తన చెవి దుద్దులను తీసి ఇచ్చినట్టు చెబుతున్నారు. తనకు ఎవరి అండా లేదని అన్నారు. తాతయ్య తానే ఉంటున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

గుంటూరు జిల్లాలో కూడా కలెక్టరేట్‌ వద్ద మహిళ సూసైడ్‌ అటెంప్ట్‌ చేశారు. తన సమస్యలు చెప్పుకోవడానికి ఈ ఉదయం కలెక్టరేట్‌కు వెళ్లారు. తన స్థలం కబ్జాకు గురి అయిందని చాలా రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. అందుకే ఇవాళ కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె తన తెచ్చుకున్న పురుగుల మందు తాగేశారు. 

పురుగుల మందు తాగేసిన మహిళ  తన భూమి కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఈ విషయం చెప్పేసి అక్కడే కూర్చుండిపోయారు. వెంటనే అధికారులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు వచ్చిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తాను అక్కడి నుంచి కదలబోనంటూ భీష్మించించారు. తన భూమిని కబ్జా చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఆమెను అధికారులు ఒప్పించి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.