బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణ ఘట్టం ప్రారంభం కాబోతోంది. డిసెంబర్15వ తేదీ నుండి 19వ తేదీ వరకు దీక్షల విమరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు పూర్తి చేశారు.
లక్షలాదిగా భవానీలు..
ఇంద్రకీలాద్రి పై జరిగే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవాల్లో భవానీ దీక్షల విరమణ ఒకటి. ప్రతి ఏటా భక్తులు భారీగా అమ్మవారి సన్నిధికి తరలి వచ్చి, భవానీ మాల విరమణ చేస్తుంటారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా భక్తుల సంఖ్య తగ్గింది. అయితే ఈ సారి దసరా ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు మాల ధరించి అమ్మవారికి సమర్పించారు. ఈ సారి భవానీ భక్తులు పెద్ద ఎత్తున మాలలు ధరించారు. దీంతో 9 లక్షలకు పైగా భవానీ భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఏర్పాట్లు పూర్తి...
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో రేపటి (డిసెంబర్ 15) నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న భవానీదీక్షల విరమణల కార్యక్రమాలకు దేవస్థానం అధికారులు సర్వం సిద్ధం చేశారు. 15వ తేదీ నుంచి జరగనున్న భవానీ దీక్షల విరమణకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేశారు. రెండు సంవత్సరాల్లో కొవిడ్‌  కారణంగా భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. ఈసారి తిరుమలతో సహా అన్ని దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో  ఈసారి భవానీ దీక్షలు తీసుకున్న భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారని ఇప్పటికే దేవస్థానం అధికారులకు సమాచారం ఉంది. ఆ మేరకు ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇరుముడి  సమర్పించేందుకు.ప్రత్యేకంగా హోమగుండాలను సిద్ధం చేశారు. స్వాగత ద్వారాలు, ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్నానఘాట్ల వద్ద మొత్తంగా 800  జల్లు స్నానాలను కూడ సిద్ధం చేశారు. మహిళా భవానీ భక్తులు డ్రస్ ఛేంజింగ్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లు, కేశఖండనశాల కూడ ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయం, ఘాట్‌రోడ్డు, గాలిగోపురం, గర్భాలయ శిఖరం, ఆలయ ప్రాంగణం అంతటా విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేశారు. 
భవానీలకు ఉచిత దర్శనం కల్పించాలని వీహెచ్‌పీ ఇదివరకే డిమాండ్ చేసింది. ఈ మేరకు వీహెచ్ పీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, దేవాదాయ శాఖ మంత్రి, దుర్గగుడి ఈవో లకు లేఖలు రాశారు. అమ్మవారి ప్రతిరూపంగా భావించే భవాని భక్తులకు పూర్తిగా ఉచిత దర్శనం కల్పించాలని, హిందూ సమాజం తరపున విశ్వ హిందూ పరిషత్ కోరుతుందని పరిషత్ నాయకులు అన్నారు. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్,  కార్యదర్శి రాఘవరాజు లేఖను విడుదల చేశారు. అమ్మవారి మీద భక్తిశ్రద్ధలతో ఎంతో శ్రమతో  41 రోజులు దీక్షను ఆచరించి, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఎంతో దూరం నుంచి వేయికళ్లతో, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు క్యూ లైన్ లో గంటల తరబడి పడిగాపులు పడే పరిస్దితి తేవద్దని అన్నారు.  


మాల ధరించేవారు పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా, భక్తి శ్రద్ధలతో మాల ధరించి వస్తారు కాబట్టి, అలాంటి వారికి తారతమ్యం లేకుండా దర్శనాలు కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉందని లేఖలో పేర్కొన్నారు. 100, 300, 500 రూపాయలు అని ధర నిర్ణయించి వారిని వర్గీకరించడం అమ్మవారిని అవమానించడం అవుతుందని, కాబట్టి వచ్చే ప్రతి భవాని భక్తుడికి అన్ని ఉచిత దర్శనాలు కల్పించాలని, వారికి శీఘ్ర దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని, ఉచిత దర్శనాలు ఏర్పాటు చేస్తే హిందూ ధర్మ వ్యాప్తికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు.