Minister Gudivada Amarnath : రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు, ప్రగతి గురించి టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అమర్ నాథ్ ధ్వజమెత్తారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా టీడీపీ, చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 5 లక్షల కోట్లు పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు తెచ్చామని చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.


రెండు శాతం మాత్రమే గ్రౌండింగ్ 


గత ప్రభుత్వం కుదుర్చుకున్న  ఎంఓయూల్లో కేవలం రూ. 34 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయని మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంటే కేవలం 2 శాతం మాత్రమే గ్రౌండ్ అయ్యాయని తెలిపారు. జిందాల్ స్టీల్ సంస్థ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో పెట్టుబడులు పెడుతుందన్నారు. మొదటి విడతకు త్వరలోనే భూమి పూజ చేపట్టనున్నామని అన్నారు. కడప ప్రజల చిరకాల వాంఛను తీర్చిన ఘటన జగన్ కు దక్కుతుందని వివరించారు. గతంలో వైఎస్ హయాంలో కడప స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకుంటే అప్పటి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని తెలిపారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఏపీలోని పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు విషయంలో దేశానికి దిక్సూచిగా ఉందని, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టే అవకాశం ఉందో పబ్లిక్ డొమైన్ లోనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈపీఎస్పీల ద్వారా ఆదాయం వస్తోందని తెలిపారు.13500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రస్తుతం ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిందని వివరించారు. ఇంకా 20 వేల మెగా వాట్లను పీఎస్పీల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు.


ఎవరు వచ్చినా స్వాగతిస్తాం 


రాష్ట్రం లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తే ఆహ్వానిస్తామని మంత్రి అమర్ నాథ్ వివరించారు. అమరరాజా వెళ్లిపోయిందన్నారు.. ఇప్పుడు అదే అమర రాజా  సంస్థ రూ. 250 కోట్లు పెట్టుబడులు పెడుతోందని మంత్రి తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో హెరిటేజ్ కంపెనీ పన్నులు కట్టలేదని అయినా ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదన్నారు. నిబంధనల ప్రకారం  నోటీసులిస్తే, రూ. 60 లక్షలు కట్టారని తెలిపారు. పరిశ్రమల వల్ల ఒక్క ప్రాణం పోయినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోలేదన్నారు. టీడీపీ తరహాలో అబద్దాలు చెప్పమన్నారు. తమను 23 స్థానాలకే పరిమితం చేశారని ప్రజలపై రాష్ట్రంపై చంద్రబాబుకు కోపం ఉంటే ఎలా అని మంత్రి  ప్రశ్నించారు.


రాజకీయం చేయాలనుకుంటే ఎలా


రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్న తరుణంలో కేవలం రాజకీయాల కోసమే చంద్రబాబు లేనిపోని అభాండాలను మోపటం దారుణమని మంత్రి అమర్ నాథ్  అన్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ లు అన్ని వెనక్కి వెళ్లిపోతున్నాయని, తనకు సంబంధించిన మీడియా ద్వారా చంద్రబాబు విష ప్రచారం చేపడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి అసత్య ప్రచారాలను అడ్డుకోవటంతో పాటు వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాల పై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు.