వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కర్నూలులో జరిగిన హైడ్రామా ఎపిసోడ్‌పై టీడీపీ ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ కేసు నుంచి అవినాష్‌ రెడ్డిని కాపాడడానికి పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తూ మంగళవారం (మే 23) సాయంత్రం రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్ వద్ద జరిగిన హైడ్రామాపై గవర్నర్ సమీక్ష చేయాలని టీడీపీ నేతలు కోరారు. వర్ల రామయ్యతో పాటు టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్‌, బోండా ఉమామహేశ్వర రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.


గవర్నర్‌ను కలిసిన తర్వాత టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వీల్లేదని పది మంది ఆకు రౌడీలు వచ్చి చెబితే సీబీఐ అధికారులు వెనక్కి వెళ్లిపోతారా? అని ప్రశ్నించారు. ఆ సమయంలో పోలీసులు ఎందుకు కలగజేసుకోలేదని ప్రశ్నించారు. తమ డిమాండ్లను పరిష్కరించండి అని వేలాది మంది ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తుంటే పోలీసులు వారిని నియంత్రించ గలిగారని అన్నారు. అలాంటప్పుడు కర్నూలులో పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. 


కమ్యూనిస్టులు, ప్రతిపక్ష నేతలు రోడ్లపైకి రాకుండా కూడా పోలీసులు హౌస్‌ అరెస్టులు చేశారని గుర్తు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు భారీ ఊరేగింపుగా వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. సీబీఐ అధికారులు వస్తే స్థానిక పోలీసులు భయపడతారని, కానీ, జగన్‌ నాయకత్వంలో స్థానిక పోలీసులే సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారని విమర్శించారు. పశ్చిమ బంగాల్‌లో మంత్రిని అరెస్టు చేసినప్పుడు, ఢిల్లీలో డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్టు చేసినప్పుడు సీబీఐ బాగానే పని చేసిందని గుర్తు చేశారు. కానీ, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీని అరెస్టు చేయడానికి ఎందుకు జంకుతున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శంకించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వర్ల రామయ్య అన్నారు.