CJI Ramana : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శనివారం విజయవాడలో పర్యటించనున్నారు. కోర్టు భవనాలను ప్రారంభించనున్నారు. తొమ్మిది ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న విజయవాడలోని కోర్టు కాంప్లెక్స్‌ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి.  సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగ‌ణంలో సుమారు 100 కోట్ల రూపాయ‌ల వ్యయంతో   9 అంత‌స్తుల భ‌వనాన్ని నిర్మించారు.  20న సీజే చేతుల మీద‌ుగా జ‌రిగే ప్రారంభోత్సవానికి సీఎం జ‌గ‌న్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు హాజరు కానున్నారు.  


2013 నుంచి సుదీర్ఘంగా సాగిన నిర్మాణం 


2013లోనే శంకుస్థాపన జరిగినా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తి కావ‌టానికి 9 సంవ‌త్సరాలు ప‌ట్టింది. చాలాకాలం నత్తనడకన పనులు సాగగా... మధ్యలో కరోనా కారణంగా రెండున్నర సంవ‌త్సరాల‌కు పైగా నిర్మాణం ఆగిపోయింది. ఆ త‌ర్వాత కూడా బిల్లుల చెల్లింపులు ఆల‌స్యం అయినందువల్ల పనులు ముందుకు సాగలేదు. పలువురు న్యాయ‌వాదులు హై కోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేయాల్సి వచ్చింది. చివరికి హైకోర్టు  ఆదేశాలతో ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. ఎట్టకేల‌కు 3.70ఎక‌రాల్లో 9 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయింది. జిల్లాలోని 29కోర్టుల‌ు ఒకేచోటకు చేరుతున్నందున క‌క్షిదారులకు మరింత సౌకర్యంగా ఉంటుందని న్యాయ‌వాదులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.


హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు


సీజేఐ ఎన్వీ రమణకు డాక్టరేట్ ప్రధానం చేయనున్న ఏఎన్‌యూ


సీజేఐ ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది. ఈనెల 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఆయనకు డాక్టరేట్‌ అందజేస్తామని వర్సిటీ ఇన్‌ఛార్జి ఉప కులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ వెల్లడించారు. విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన ర‌మ‌ణ‌ను డాక్టరేట్‌తో గౌరవించాలని వర్సిటీ నిర్ణయించగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కులపతి హోదాలో గవర్నర్‌ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. 


ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ చెప్పిన సీఐడీ బాస్, ఎంపీ రఘురామ సెటైర్లు


ఏఎన్‌యూ స్నాతకోత్సవానికి హాజరు కానున్న గవర్నర్ 


ఆయనకు వర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని ఈ ఏడాది మార్చి నుంచి పలుమార్లు ప్రయత్నించామని, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందని, ఆ ప్రయత్నం ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని వీసీ అన్నారు. విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసించిన మొదటి బ్యాచ్‌ విద్యార్థిగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం సముచితమని ఆయన పేర్కొన్నారు.  స్నాతకోత్సవానికి ఛాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ హాజరు కానున్నారు. 


శుక్రవారం సీజేఐ ఎన్వీ రమణ తిరుపతిలో పర్యటించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత ఆయన తిరుపతిలో మహాత్మాగాంధీపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీ మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.