ఏపీలో వినాయ‌క చ‌వితి పండుగల‌కు ప్ర‌భుత్వం అడ్డంకుల‌ను సృష్టిస్తోంద‌ని ఆరోపిస్తూ బీజేపీ నేత‌లు ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు క్యాడ‌ర్ కు ఆదేశాలు ఇచ్చారు. విఘ్నాధిపతి వేడుకులకు విఘ్నాలా  ఇదేమి దుర్మార్ఘపు ప్రభుత్వం.. నిబంధనల పేరుతో  వినాయక చవితి వేడుకులకు పరోక్ష ఆటంకాలకు ప్రభుత్వం పాల్పడుతున్న  అనుమానాలు బలపడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆందోళనలు, నిరసనలు నిర్వహించాలని సోమువీర్రాజు బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ పదాధికారులు జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీల ఇన్చార్జిల ఫోన్ కాన్ఫరెన్స్ లో రేపు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహసిల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని నిరసన కార్యక్రమాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలు, ఆందోళన తర్వాత తహసీల్దారులకు వినతి పత్రం సమర్పించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు.


వినాయక చవితి ఉత్సవాలకు మంటపాలు, పందిళ్లు ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది.


హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే వినాయక చవితి పండుగను నిబంధనల పేరుతో పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో వీధుల్లో వాడల్లో జరుపుకోవడానికి అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఆంక్షలు పెట్టడం ద్వారా వినాయక చవితి ఉత్సవాలను నిర్వాహకులను నిరుత్సాహపరచి, మంటపాల సంఖ్యను రాష్ట్ర వ్యాప్తంగా తగ్గించాలనే కుట్ర జరుపుతోందని సోము వీర్రాజు తీవ్రంగా దుయ్యపట్టారు. ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల అనుమతులు పొందాలని కుట్రపూరితంగా రాష్ట్ర డీజీపీ ద్వారా ఆదేశాలు జారీ చేయించి క్షేత్రస్థాయిలో మండపాల నిర్వాహకులను ఉత్సవ సమితి సభ్యులను వివిధ రకాలుగా వేధిస్తూ ఈ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మేల్కొని వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాలని, వినాయక చవితి పందిళ్లకు పోలీసు శాఖ నుండి మైక్ అనుమతి మినహా మరి ఏ ఇతర అనుమతులను తీసుకోవాలనే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి ఉత్సవాలను దరఖాస్తు చేసిన వెంటనే సింగిల్ విండో సిస్టంలో అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తుందని సోము వీర్రాజు ప్రకటించారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని  సోము వీర్రాజు హెచ్చరించారు.


చ‌వితి పందిళ్ళ‌ చుట్టూ రాజ‌కీయం
ఏపీలో చ‌వితి పందిళ్ళ రాజ‌కీయం మెద‌లైంది. ఇప్ప‌టి కే ఈ వ్య‌వ‌హ‌రంపై టీడీపీ నేత‌లు వైసీపీని టార్గెట్ చేసి నేరుగా విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాల నుండి వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను అధికార ప‌క్షం కూడా కౌంట‌ర్ ఇస్తూనే ఉంది. అయితే బీజేపి ఈ వ్య‌వ‌హ‌రంపై మ‌రింత దూకుడుగా వెళ్లాల‌ని నిర్ణ‌యించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌ను త‌ల‌పెట్టింది. అటు ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచ‌టంతో పాటుగా, రాజ‌కీయంగా ఈ వ్య‌వ‌హారాన్ని వాడుకోవ‌టం ద్వారా ప్ర‌జ‌ల్లోకి పార్టీని తీసుకువెళ్ళేందుకు వీలుంటుంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. అయితే బీజేపీకి హిందుత్వ ముద్ర కూడా ఉండ‌టంతో ప‌నిలో ప‌నిగా అదే కోణంలో ఈ వ్య‌వ‌హ‌రంపై క‌మ‌ల దళాన్ని వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇస్తున్నారు.