Criminal Case On Sajjala Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత హాట్‌గా మారుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌, కౌంటింగ్ నేపథ్యంలో జరుగుతున్న పోరు మరో మలుపు తిరిగింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా కేసు రిజిస్టర్ అయింది. టీడీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. 


కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో వైసీపీ రెండు రోజుల క్రితం ఓ మీటింగ్ పెట్టింది. ఇందులో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించే వాళ్లను కౌటింగ్ ఏజెంట్లుగా కూర్చొబెట్టొద్దని గట్టిగా నిలదీసేవాళ్లను ఉంచాలని కేడర్‌కు సూచించారు. ఇదే ఇప్పుడు కేసుకు కారణమైంది. 


రూల్స్ పాటించే కౌటింగ్ ఏజెంట్లు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలు కేడర్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న తీసుకున్న తాడేపల్లి పోలీసులు 153, 505, 125 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు పెట్టారు.