AP CM Deputy CM Pawan Kalyan: సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు, తిరుమల వ్యవహారాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడకపోవడం మంచిదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సూచించారు. హేళన చేస్తూ మాట్లాడితే మాత్రం ప్రజలు క్షమించరని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన వారికి ఈ విషయంలో పద్దతిగా మాట్లాడాలని హెచ్చరించారు.  


తిరుమల లడ్డూ వివాదంపై పొన్నవోలు సుధాకర్‌, ప్రకాశ్‌ రాజ్  చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటం మేలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇన్ని రోజులు తనను వ్యక్తిగతంగా విమర్శించినా ఊరుకున్నానని తనను, తన ఫ్యామిలీని రోడ్డుపైకి లాగినా పట్టించుకోలేదని అన్నారు. సనాతన ధర్మం, హిందువుల గురించి మాత్రం కామెంట్స్ చేసి ఊరుకునేది లేదన్నారు. 


పొన్నవోలు లాంటి వాళ్లు మౌనం దాటి పొగరుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతలు ఎవరూ సనాతన ధర్మం జోలికి రావద్దని హెచ్చరించారు. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి. లేదంటే సంబంధం లేదని తప్పుకోండి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం కచ్చితంగా రియాక్షన్ ఉంటుందని అన్నారు. 


పొన్నవోలు సుధాకర్‌... మీరు హిందువులే. తమాషాలుగా ఉందా మీకు. సరదాగా ఉందా. మొన్నటి మొన్న ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. నేను మాట్లాడుతోంది.... అపవిత్రం విషయంపై మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాశ్ రాజ్‌కు ఏంటి సంబంధం. నేను ఇంకో మతాన్ని నిందించానా. ఇస్లాంను నిందించానా. క్రిస్టియానిటీని నిందించానా. అపవిత్రం జరిగింది... ఇలా జరగకూడదు. కల్తీ జరిగకూడదని మాట్లాడుతుంటే... గోల అంటారా. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిర్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం పిచ్చిపట్టింది ఒక్కొక్కరికి. ఎవరిక కోసం మాట్లాడుతున్నారు. 


"ప్రకాశ్ రాజ్‌కి కూడా చెబుతున్నాను. నాకు మీరు అంటే చాలా గౌరవం. కానీ సెక్యులరిజం రెండువైపులా ఉండాలి. అది మీకు బాగా తెలుసు. హిందువులపై దాడి జరిగినప్పుుడ మాట్లడటం తప్పా? నేను చాలా మంది ముస్లిం రైతులకు సాయం చేశాను. ఇదే మద్రాసాలకు డబ్బులు ఇచ్చాను. ఇస్లాం, క్రిస్టియానిటీపై గౌరవం ఉన్నవాడిని. చిన్నప్పటి నుంచి మిషనరీ స్కూల్స్‌లో చదువుకున్న వాడిని. నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలంటే ఎలా. ఇదేం సెక్యలరిజం. నా ఇంటిపై దాడి జరిగితే నేను స్పందించకూడదా. నా ఇల్లు పదిమందికి ఆశ్రయమిస్తోంది. సనాతన ధర్మం అన్ని మతాలకు ఆశ్రయమైనప్పుడు దానిపై జరిగితేనో, అపవిత్రం జరిగితేనో మాట్లాడకూడదంటే ఇంకేం చెబుతాం.  ప్రకాశ్ రాజ్‌ మీరు పాఠాలు నేర్చుకోవాలి."


"ఇది ఒక్క ప్రకాశ్ రాజ్‌కే కాకుండా సెక్యులరిజం పేరుతో మాట్లాడే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. మేం చాలా బాధపడుతున్నాం. మా సెంటిమెంట్స్‌పై దాడి చేయొద్దు. ఇది మీకు ఆనందాన్ని ఇయ్యవచ్చు. మాకు కాదు. ఇది చాలా బాధాకరమైన ఘటన. ఇది మర్చిపోవద్దు. సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు వందలసార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు."


"ఇక చాలు ఆపేయండి. సనాతన ధర్మంపై ఇష్టానికి మాట్లాడుతున్నారు. అయ్యప్ప స్వామిపై, సరస్వతి దేవిపై మాట్లాడతారు. అల్లాపై మీరు మాట్లాడగలరా. మహమ్మద్ ప్రవక్తపై మాట్లాడగలరా... జీసస్‌పై మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మంపై, వినాయకుడిపై జోకులు వేస్తారు. దుర్గాదేవిపై జోక్స్ వేస్తారు. సరస్వతి దేవిపై జోక్స్ వేస్తారు. మా మనోభావాలు గాయపడవా." 


బంగారంలో రాగి కలుపుతారు కానీ ఇత్తడిలో కలుపుతారా అంటూ మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారని పొన్నవోలుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కోర్టులో కేసులు వేస్తారో ఏం చేసుకుంటారో చేసుకోండని హెచ్చరించారు. సనాతన ధర్మం గురించి హేళనగా మాట్లాడితే అందర్నీ రోడ్లపైకి లాగుతామన్నారు. జరిగిన తప్పునకు ప్రాయశ్ఛితం చేసుకోండి లేదా మౌనంగా ఉండాలే తప్ప మనోభావాలను గాయపరిచేలా మాట్లాడొద్దని హితవు పలికారు. 


తిరుమల దేవస్థానంలో తప్పు చేసి ఉంటే సర్వనాశనమైపోతామని... రక్తం కక్కుకొని చచ్చిపోతామన్న భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై కూడా పవన్ స్పందించారు. అల్రెడీ నాశనం మొదలైందని... రెండోది దేవుడికే వదిలేస్తున్నామని అన్నారు. విచారణకు రావాలంటే వైవీ సుబ్బారెడ్డికి రికార్డ్స్‌ ఇవ్వాలని అంటున్నారని గతంలో విచారణలకు పిలిచినప్పుడు ఇలానే రికార్డ్స్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు పవన్. విచారణకు సిద్ధం కావాలని సూచించారు. 


‌అప్పట్లో ఈవోగా చేసిన ధర్మారెడ్డి ఏమైపోయారని పవన్ ఆశ్చర్యపోయారు. ఇంత జరుగుతున్నా ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాను తిరుమల ధర్శనానికి వెళ్లినప్పుడు ధర్మారెడ్డి ఎలా ప్రవర్తించారో తాను చూశానని అన్నారు. తిరుమలను ఇష్టారాజ్యాంగా మార్చేశారనని మండిపడ్డారు. మక్కాను చూసి నేర్చుకోవాలని అన్నారు. బిడ్డ చనిపోయిన 11 రోజుల వరకు దేవాలయంలోకి రాకూడదని తెలిసి కూడా తిరుమలకు ఎలా వచ్చారని నిలదీశారు.


ప్రతి దాన్ని రాజకీయం చేయడానికి తాము లేమని అన్నారు పవన్ కల్యాణ్. నిజంగా రాజకీయం చేస్తోందని వైసీపీ నేతలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేల అన్ని మతాలను గౌరవిస్తుందన్న పవన్... హిందువులు మౌనం తరాలు నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తిరుమల వెంకటశ్వర స్వామికి జరిగిందే అయినా ఆయన్ని నమ్ముకున్న మనం కచ్చితంగా స్పందించాల్సిందేనన్నారు. 


అదే టైంలో సినిమా పరిశ్రమకు కూడా గట్టి హెచ్చరికలనే పంపించారు పవన్ కల్యాణ్. మతాలతో సంబంధం లేకుండా సినిమాలు చూసే ప్రేక్షకుల్లో కూడా హిందువులు ఉన్నారని వారు కూడా మాట్లాడారని సూచించారు. సినిమాలు గురించి మాట్లాడతారు... సినిమా అభిమానుల కోసం ఆరాట పడతారు.  ఇలాంటివి వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. ఆ హీరోలకు మించి హిందూ ధర్మాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు. 


సినిమా పరిశ్రమలో వాళ్లు కూడా మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చొండి అని పవన్ హెచ్చరించారు. మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని వార్నింగ్ ఇచ్చారు. లడ్డూ చాలా సెన్సిటివ్ అంటూ లడ్డూపై జోకులు వేస్తున్నారని కార్తీ పేరు చెప్పకుండానే ఫైర్ అయ్యారు. అలా చెప్పొద్దని సూచించారు. అలా చెప్పే ధైర్యం కూడా చేయొద్దన్నారు. నటులుగా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని స్ట్రాంగ్‌గా చెప్పారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండిని సూచించారు. 


ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే బాధ కలుగుతుందన్నారు పవన్ కల్యాణ్. అయ్యప్ప స్వామి మాలవేసిన వారీని హేళన చేస్తూ మాట్లడాతారు... అదే ఇస్లాంపై మాట్లాడతారా... మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్లు రోడ్లపైకి వచ్చి కొడతారని భయం. హిందువులంటే మెత్తని మనుషులు ఏం చేయరని ఇలా చేస్తున్నారని అన్నారు. మీకు నమ్మకాలు లేకుంటే ఇంట్లో కూర్చోండి అంతే కాని మమ్మల్ని ఏమనొద్దని హితవుపలికారు. 


Also Read: సనాతన ధర్మానికి అవమానం జరుగుతుంటే హిందువులకు బాధ్యత లేదా? పవన్ కల్యాణ్ సంచనల వ్యాఖ్యలు