AP Deputy CM Pawan Kalyan:  తిరుమల లడ్డూ విషయంలో జరిగిన అపవిత్రతపై మూడు రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇవాళ  దుర్గగుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతానికి, సనాతన ధర్మానికి ఇంత అవమానం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని హిందువులను ప్రశ్నించారు. ఇదే వేరే మతంలో వేర ప్రాంతంలో జరిగి ఉంటే పరిస్థితి ఇలానే ఉండేదా అని ప్రశ్నించారు. హిందువుల మౌనాన్ని చేతకానితనంగా భావిస్తున్న కొందరు ఇష్టం వచ్చినట్టు మట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పలువురు చేసిన కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. 


ఆలోచించి మాట్లాడండి


సెక్యులరిజం అంటే రెండు వైపుల నుంచి ఉండాలని... ఒకవైపు ఆలోచించే వాళ్లు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ఇప్పటికి జరిగింది చాలన్నారు. హిందువుల్లో ఓపిక నశించిందని... తన లాంటి వాళ్లు తలచుకుంటే సనాతన ధర్మంపై పోరాటం చేస్తే అడ్డుకునే వాళ్లు దేశంలోనే ఎవరూ లేరని హెచ్చరించారు. పొన్నవోలు, సుబ్బారెడ్డి, కురణాకర్ రెడ్డి, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు మాట్లాడే ప్రతి మాట వందసార్లు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. లేకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. 


ఆందర్నీ సమనంగా స్వీకరించాం


చిన్నప్పటి నుంచి తాను సనాతన ధర్మాన్ని నిష్టతో పాటించామని ఇంట్లో ఎప్పుడూ రామనామ జపం వినిపించేదన్నారు పవన్ కల్యాణ్. పండగల టైంలో తప్ప ఆ విషయాన్ని పెద్దగా ప్రొజెక్టు చేసుకోమని... తానే కాదు... ఏ హిందువైనా సరే అలానే చేస్తాడని చెప్పుకొచ్చారు. అవసరమైన సమయాల్లోనే ఆధ్యాత్మిక విషయాలు పంచుకుంటారని తెలిపారు. ఏ హిందువైనా అన్ని మతస్తులు సమాన భావంతో చూస్తుంటారని రాజుల కాలం నుంచి ఈ సంప్రదాయం వస్తుందని అన్నారు. దేశంలో హిందువులకు భయంగాని, వేరే మతం, వ్యక్తిపై ద్వేషంగాని ఉండదన్నారు. పురానత కాలం నుంచి ఏ మతస్తులు, ఏ దేశస్తులు వచ్చినా సమానంగా తీసుకుంటారు. 


ఐదేళ్లలో ఇలాంటివి ఎన్నో?


కానీ ఇక్కడ హిందువులే హిందువులకు శత్రువుగా మారుతున్నారని సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో హిందూ సంప్రదాయాలను పాటించే వారంతా మీడియా కనిపించే వేరే వేదికలపై తన సంప్రదాయాలను, కించపరిచేలా మాట్లాడుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా వైసీపీ పాలనలో ఇదే జరిగిందన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి సింహాలు మాయమైనప్పుడు, విజయనగరంలో విగ్రహాలు తలలు విరగ్గొట్టినప్పుడు కూడా ఇలాంటి కూతలు విన్నామన్నారు. 


పదవుల్లో ఉన్న వాళ్లు బాధ్యత తీసుకోవాలి


హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లంతా కూడా హిందువులేనన్నారు పవన్. వాళ్లంతా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లేనని గుర్తు చేశారు. ఇప్పుడు తప్పు జరిగిందని చెబుతుంటే... పదవులు అనుభవించి వాళ్లు వెటకారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఏ మతం పుచ్చుకున్నరో తనకు తెలియదని అది అవసరం లేదని అన్నారు. కానీ వాళ్లంతా గతంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నందున బాధ్యత తీసుకోవాలని సూచించారు. హైందవ ధర్మాన్ని కాపడతాననీ కీలకమైన పదవులు స్వీకరించారని అందుకే జరిగిన వాటికి బాధ్యత వహించాలని హితవు పలికారు. 


గొడవ పెట్టుకోవాలంటే క్షణం చాలు!


జరిగిన ఉదంతంలో జగన్‌ను బ్లేమ్ చేయడం లేదన్న పవన్ కల్యాణ్  వారి ఆధ్వర్యంలో జరిగిన తప్పులు మాత్రమే గుర్తించామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుంటే ఇలా మాట్లాడటానికి తమకు వేరే పనులు లేక కాదన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే ఇలాంటి వాటిపై స్పందిస్తారని తెలిపారు. దీన్నే అడ్డం పెట్టుకొని రచ్చ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు పవన్ కల్యాణ్. అలా చేయాలనుకుంటే ... రాముడి విగ్రహ శిరచ్ఛేదన జరిగినప్పుడే గొడవ చేసే వాడినన్నారు. గొడవ పెట్టుకోవాలంటే చాలా సులభమని చెప్పుకొచ్చారు. 


ప్రజలు బాగుండాలని, రాజ్యాంగం అమలు కావాలని కోరుకునే వాళ్లమన్నారు పవన్. కానీ ఇక్కడ సెక్యులరిజమ్‌ పేరుతో ఒకవైపే మాట్లాడే వాళ్లను చూస్తే బాధగా ఉందన్నారు. సెక్యులరిజం అంటే రెండువైపుల నుంచి ఉండాలనే సూత్రాన్ని మర్చిపోతున్నారని మండిపడ్డారు. ఇదే చాలా మంది హిందువులకు ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇప్పుడే జరిగిందని కాదని... దశాబ్ధాలుగా ఇదే జరుగుతోందన్నారు. వ్యక్తిగత హిందూ ధర్మాలను పాటిస్తున్న వారే తోటి హిందువులను తిడుతున్నారని అన్నారు. 


ఈ పరిణామాలపై ఎవర్నీ నిందించడం లేదన్న పవన్ కల్యాణ్‌... బాధ్యత తీసుకున్న హిందువులు మాత్రం కచ్చితంగా మాట్లాడాలని గట్టిగా చెప్పారు. విగ్రహాలు పోతే ఇళ్లు కట్టుకుంటాం అంటూ గతంలో మాట్లాడారని గుర్తు చేశారు. ఇదే విషయంలో మసీదులో ఇలాంటివి జరిగితే మాట్లాడతారా అని ప్రశ్నించారు. హిందువులు పట్టించుకోరని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మీకు బాధ్యత లేదా?


ఇలా ఎవరో ఒకరు మాట్లాడిన ప్రతిసారీ రాలేకపోతున్నాం. అందుకే సనాతన ధర్మ బోర్డు ఉండాలని మేం ప్రతిపాదించాం. ప్రతిసారి కూర్చోబెట్టి డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు ధర్మం. ఇదే వేరే మతంపై దాడి చేస్తే ఎంత మంది రియాక్ట్ అవుతారు... మీరు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయమని చెప్పడం లేదు. కానీ కనీసం కోపాలు రాకపోతే ఎలా. గుడికి వెళ్లే ప్రతి హిందువు బాధ్యత కాదా... మా బాధ్యతేనా మీకు లేదా. ధర్మాన్ని పరిరక్షించడం మీ బాధ్యత కాదా?


తిరుమల లడ్డూలో జరిగిన అపచారానికి ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ దుర్గుగడిలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఆలయానికి వెళ్లిన డిప్యూటీ సీఎంను అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అక్కడు చేరుకున్న పవన్ కల్యాణ్ ఆలయ మెట్లను శుభ్రం చేశారు.