ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్చడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే దీనిపై వివిధ వర్గాల నాయకులు, రాజకీయపార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ కూడా ఘాటుగా స్పందించింది. యూనివర్శిటీకి మూలకారకుడైన వ్యక్తి పేరునిు తొలగించడం ఏంటని ప్రశ్నింస్తోంది. 


నందమూరి రామకృష్ణ పేరు మీద విడుదల ప్రెస్‌నోట్‌లో ప్రభుత్వం చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. అన్ని మెడికల్ కాలేజీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న సంకల్పంతో నందమూరి తారకరామారావు... హెల్త్‌ యూనివర్శిటీని 1986లో స్థాపించారని గుర్తు చేశారు.  


అప్పట్లో ఎన్టీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలంతా హర్షించారని, అన్ని పార్టీల నాయకులు స్వాగతించారన్నారు. మద్దతు కూడా తెలిపినట్టు వివరించారు. నందమూరి తారకరామారావు 1996లో మరణించిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును చంద్రబాబు పెట్టారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ పేరును తొలగించాలన్న ఆలోచన చేయలేదని అభిప్రాయపడ్డారు.


అలాంటి ప్రజానాయకుడి పేరును జగన్ మార్చటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరును తొలిగించటం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు ఎన్టీఆర్ అనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహానాయకుడికి ఇలాంటి అవమానం సరికాదన్నారు. ఆ పేరుతోనే మెడికల్‌ హెల్త్ యూనివర్శిటీ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. 


చంద్రబాబు ఆగ్రహం


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌ పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌కు ఏం సంబంధమని నిలదీశారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి తండ్రి పేరు ఎలా పెట్టుకుంటాడని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని చంద్రబాబు అన్నారు.


‘‘హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.


ఏపీ అసెంబ్లీలో రచ్చ


ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభం కాగానే శాసనసభ స్పీకర్‌ తమ్మినేని తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. నేడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లు సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పేరు మార్పు అంశాన్ని టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. అయినా వారు నిరసన మరింత ఎక్కువ చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.


స్పీకర్‌పై పేపర్లు చింపి వేసిన టీడీపీ సభ్యులు, అంతా సస్పెన్షన్



ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం అసెంబ్లీలో మరింత రగడ రేపింది. తొలుత ప్రారంభమైన కాసేపటికే టీడీపీ సభ్యుల ఆందోళనతో వాయిదా ఏపీ అసెంబ్లీ మళ్లీ ఉదయం 11 గంటలు దాటాక తిరిగి ప్రారంభం అయింది. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకంగా పోడియం వద్దకు, స్పీకర్ కుర్చీని చుట్టుముట్టి, బిల్లు ప్రతులను చంపి స్పీకర్ మీద వేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పీకర్ 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. అయినా టీడీపీ సభ్యులు సభ నుంచి కదలకపోవడంతో మార్షల్స్ సాయంతో సభ నుంచి బలవంతంగా బయటకు పంపించారు.