Kottu Satyanarayana: రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం చేయాలని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మే 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు 6 రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.


ఆరు రోజుల పాటు జరిగే రాజశ్యామల యాగానికి ఒక్కో రోజు ఒక్కో పీఠాధిపతిని ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 450 మంది రుత్వికులు ఈ యాగంలో పాల్గొంటారని కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. యాగం నిర్వహణ కోసం దేవాదాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాగానికి రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజశ్యామల యాగానికి వచ్చే వారికి రెండు పూటలా ప్రసాదంతో పాటు నీరు, మజ్జిగ అందజేస్తామని వెల్లడించారు. ఎండాకాలంలో జరుగుతున్న ఈ యాగానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 


రాజ శ్యామల యాగం


రాజ్యలక్ష్మి వరించాలని.. విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు.


రాజసూయ యాగం


'సూయం' అంటే శాశ్వతం... రాజ్యాన్ని, రాజుని శాశ్వతంగా ఉండేలా చేసేది కునుకే రాజసూయ యాగం అంటారు. తమ సార్వభౌమాత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో చేసే యాగం ఇది. రాజసూయ యూగం రాజ్యం నిలబడడానికి, నా విజయానికి ఎదురులేదని చెప్పడానికి, శత్రువు తన ఎదురు నిలిచేందుకు కూడా సహాసించలేడని చెప్పేందుకు ప్రతీక. ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు, మండలం రోజులు అంటే 41 రోజులు చేయొచ్చు..ఇంకా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు చేస్తారు. యాగం ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే సమయానికి అక్కడున్న సభలో ఎవరు గొప్పవారైతే వారికి ధారపోస్తారు. ధర్మరాజుతో కృష్ణుడు చేయించిన యాగం ఇది. రాజసూయ యాగం..ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయిస్తాడు. మహాభారతంలో సభాపర్వంలోనే ఉంటుంది ఈ యాగం ప్రస్తావన.  శత్రు క్షయాన్నీ, కీర్తినీ, విజయాన్నీ సిద్ధింప చేస్తుంది కాబట్టి తప్పక ఈ యాగాన్ని చేయాలని శ్రీ కృష్ణుడు సూచించాడు.  మయసభలో దుర్యోధనుడి పరాభవం - మహాభారత యుద్ధానికి మూలం కూడా ఇక్కడే జరిగింది. యాగం పూర్తైన తర్వాత శిశుపాలుడి వధ జరిగిందీ ఇక్కడే అంటే యాగం పూర్తైన వెంటనే శత్రు సంహారం జరిగిందన్నమాట..


రాజసూయ యాగం- రాజ శ్యామల యాగం ఒకటేనా!


మహాభారతంలో ధర్మరాజు తో శ్రీ కృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న రాజ శ్యామల యాగం ఒకటేనా అంటే...ఈ రెండు యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే. ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువులు క్షీణించాలి,  సార్వ భౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని చేస్తారు. రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు అది నిర్వహించడం అంత సుసాధ్యం కాదు అందుకే అందుకు ప్రతిగా రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయమని శ్యామలా దేవిని ప్రశన్నం చేసుకుంటారు.