Botsa Satyanarayana: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను, చంద్రబాబు అరెస్టు, జ్యుడీషియల్‌ కస్టడీ విధించడం వంటివి ప్రజలు గమనిస్తున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ ను హైకోర్టు తిరస్కరించడం కూడా అందరూ చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు వర్చువల్‌ విచారణలో ఏసీబీ జడ్జి ముందు ఆవేదన చెందారని, తాను నీతిమంతుడిని అని చెప్పుకొచ్చారని బొత్స తెలిపారు. దాన్ని ఎల్లో మీడియా బాగా హైలైట్‌ చేసిందని, అలాగే వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ఆక్రోషాన్ని, చంద్రబాబుపై ఉన్న ప్రేమను వెళ్లగక్కాయని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వారు, పరిపాలన చేసే వాళ్లు, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని బొత్స సూచించారు. ఎక్కడా అవినీతికి పాల్పడవద్దని, కానీ చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాల్లో వాటన్నింటినీ అతిక్రమించారని.. కానీ ఎప్పుడూ దొరకలేదని ఇప్పుడు దొరికి దొంగ అయ్యారని.. దీంతో ఆయన బేలగా మాట్లాడుతున్నారు అంటూ బొత్స విమర్శలు గుప్పించారు.


సీమెన్స్‌ పెట్టుబడి ఎందుకు రాలేదు?:


'మేము సీమెన్స్‌ కంపెనీ మంచిది కాదని చెప్పడం లేదు. ఆ కంపెనీని తప్పు పట్టడం లేదు. కానీ మీరు ఆ కంపెనీతో ముందు చేసుకున్న ఒప్పందం ఏమైంది? ఆ కంపెనీ ఎందుకు పెట్టుబడి పెట్టలేదని మాత్రమే అడుగుతున్నాం మన ప్రభుత్వం వాటా రూ.371 కోట్లు ఇచ్చారు. కానీ సీమెన్స్‌ కంపెనీ తన వాటాగా ఇవ్వాల్సిన దాదాపు రూ.3 వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు? మరి అప్పటి ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేసింది? దీనిపై చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ అస్సలు ఎందుకు మాట్లాడడం లేదు? మరి ఒప్పందం చేసుకున్న డిజైన్‌ టెక్‌ కంపెనీ ఏ పద్ధతిలో ఎంపిక చేసుకున్నారు? ఏ విధానంలో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. అవన్నీ అక్రమం అని చంద్రబాబుకు తెలియదా? అంటే తెలిసే ఆయన ఆ అక్రమానికి తెర లేపారు.


సీమెన్స్‌ కంపెనీ గుజరాత్‌లో ఒప్పందం చేసుకుని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యాక్టివిటీ చేసింది. కానీ అందుకు చాలా తక్కువ పెట్టుబడి పెట్టారు. అక్కడ సాఫ్ట్‌వేర్‌ ఇచ్చారు. పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ సీమెన్స్‌ కంపెనీ ఏ పనీ చేయలేదు. వారు పెట్టాల్సిన పెట్టుబడి పెట్టలేదు' అని బొత్స సత్యానారాయణ అన్నారు.


'పోచారం వ్యాఖ్యలు ఖండిస్తున్నాం'


'నిన్న తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. కారణం చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఒక నాయకుడు అలా మాట్లాడొచ్చా? అందుకే మేము పోచారం మాటలను ఖండిస్తున్నాం. చంద్రబాబు తప్పు చేయలేదని ఆయన అనుకుంటే, ఆ విషయాన్ని తెలంగాణ సీఎంతో మాట్లాడాలి. మా ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా, చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఎక్కడ, ఏ అవకతవకలు జరిగినట్లు తెలిసినా, ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం. 


ఈ రోజు ఎల్లో మీడియా పేజీలకొద్దీ రాశాయి. వారినే అడుగుతున్నాను. వెళ్లి చంద్రబాబును అడగమనండి. ఏమయ్యా, సీమెన్స్‌ కంపెనీ ఒప్పందం ప్రకారం పెట్టుబడి ఎందుకు పెట్టలేదు? ఇక్కడ ఏ కార్యకలాపాలు నిర్వహించలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేసిందని.. చంద్రబాబును అడగాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు బాధ్యతతో వ్యవహరించాలి, ప్రజాధనాన్ని కాపాడాలి. అంతేకానీ, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు.


'అంత పెట్టుబడి అవసరమా?:


మేము సీమెన్స్‌ కంపెనీని ఏమీ అనడం లేదు. తమకు ఆ ఒప్పందంతో సంబంధం లేదని స్వయంగా సీమెన్స్‌ కంపెనీ చెప్పింది. ఆ మెయిల్‌ లేఖ కూడా మేము చూపాం. అసలు మన దగ్గర సెంటర్లు ఎక్కడున్నాయి? ఒక్కో సెంటర్‌కు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. నిజంగా వాటికి అంత పెట్టుబడి అవసరమా? అసలు వాటికి సీమెన్స్‌ కంపెనీ, సాఫ్ట్‌వేర్‌ ఏమైనా ఇచ్చిందా? అవన్నీ చూద్దాం. సీమెన్స్‌ కంపెనీ కేవలం రూ.55 కోట్ల సాఫ్ట్‌వేర్‌ మాత్రమే ఇచ్చింది. ఆ మొత్తం తమకు వచ్చిందిన సీమెన్స్‌ కంపెనీ కూడా చెప్పింది. 


మాకు ఎవరిపైనా ప్రేమ లేదు. ద్వేషం లేదు. ఎవరైనా తప్పు చేస్తే, చర్యలు తీసుకుంటాం. మీరు అంటున్నారు కదా.. ప్రేమచంద్రారెడ్డి రాశారని. ఉంటే చూపండి. మాకు ఎవరైనా ఒకటే. ఒప్పందంలో స్పష్టత లేదని, కాబట్టి ప్రభుత్వం నిధులు విడుదల చేయొద్దని అప్పటి అధికారులు కోరారు. అయినా, అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ. 371 కోట్లు ఇచ్చారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. బ్లూబుక్‌ ఉంటుంది. అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తి (స్వయంగా సీఎం) నేరుగా ఆదేశిస్తే.. అధికారులు అమలు చేయక తప్పదు కదా?' అని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు.