ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. పార్లమెంటులోని పీఎం ఆఫీసులో ఇరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల ప్రస్తావించారు. పోలవరానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు! పలు అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు సీఎం జగన్! 


మోదీకి జగన్ ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలు


1. రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోంది. ఇప్పటివరకూ నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిపై వెంటనే దృష్టిసారించండి.


2. గతంలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించింది. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయి. 


3. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ. 36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ చేస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నిధులను వెంటనే విడుదలచేయాల్సిందిగా, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వండి. 


4. గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణపరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోండి. 


5. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాలవాంఛను నెరవేర్చేదిశగా ప్రాజెక్టు నిర్మాణాన్ని సాగిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయలో కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్దికాలంలోనే ఇది వాస్తవ రూపంలోకి వస్తుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాను సొంతంగా సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వండి. 


6. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదించండి.


7. తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వారీగా నిబంధనలను సడలించండి. 


8. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుంది. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని తగ్గించవచ్చు. 


9. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్గా రూ.10వేల కోట్లు మంజూరు చేయాలి.


10. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించండి. 


11. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల PMGKAY కార్యక్రమం కిందకు రాని, 56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇస్తోంది. దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలోఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం వినియోగించని రేషన్ కోటాను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. 


12. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.  


13. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతిజిల్లాకు సుమారుగా 18 లక్షలమంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాను. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని విజ్ఞప్తిచేస్తున్నాను. అని మోదికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. 


14. వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజనచట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీ ఎండీసీకి గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.