Vijayawada News :  మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు, జడ్పీ మీటింగ్‌లు ఎక్కడ జరిగినా ప్రధానాంశంగా చెత్త పన్ను అంటోంది. వైఎస్ఆర్‌సీపీ నేతలతో పాటు టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశంపై గళమెత్తుతున్నారు. తాజాగా  చెత్త పన్ను రద్దు అంశం పై బెజ‌వాడ కార్పోరేష‌న్ కౌన్సిల్లోనూ రచ్చకు కారణం అయింది.  టీడీపీ.సీపీఎం కార్పోరేట‌ర్లు చెత్త ప‌న్నుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేశారు. చెత్త పన్ను చెల్లించకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తాం ,కార్మికుల, ఉద్యోగుల‌ జీతాల్లో కోతలు పెడ‌తాం అంటూ అదికారులు వేదింపుల‌కు గురి చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షం ఆరోపించింది. చెత్త ప‌న్ను ఇవ్వ‌ని దుకాణాల‌ను సీజ్ చేస్తామ‌ని వేదింపులకు గురి చేస్తున్నారంటూ, మేయర్ పోడియం ముందు సీపీఎం కార్పోరేట‌ర్ బైఠాయించారు. నాలుగేళ్లు అవుతున్న ఒక ఇల్లు  ఇవ్వని వైసీపీ ప్రభుత్వం,పేదల పింఛన్లు, రేషన్ కార్డు, అమ్మ ఒడి, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ను రద్దు చేస్తున్నారని ఆరోపించారు.  


కార్పొరేషన్ నిధులు నొక్కేసిన రాష్ట్ర ప్రభుత్వం


ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసగించడం, నగరంలో విలువైన స్థలాలను అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వ జీవోలను 390  ఆమోదించడం , రూ. 289 కోట్ల నిధులు నగరంలో స్ట్రామ్ వాటర్ డ్రైన్ల నిర్మాణం వంటి వాటిపై సభ్యులు అధికారపక్షంపై విరుచుకుపడ్డారు.  రూ. 289 కోట్ల నిధులు మంజూరైనవి రాష్ట్ర ప్రభుత్వం కైంకేర్యం చేసింద‌ని ప్ర‌తిప‌క్ష కార్పోరేట‌ర్లు ఆరోపించారు. చిన్నపాటి వర్షాలకే జలమయం అవుతున్న రోడ్లు. గోతులు రోడ్లతో ఇబ్బందుల  పడుతున్న నగర ప్రజలు, అభివృద్ధిపై శ్రద్ధ లేని నగరపాలకులు,కార్మికుల వేతనాలు పెంపుపై మోసగించారని మండిపడ్డారు.   కార్పొరేటర్ల వేతనాలు పెంచాలని తీర్మానాలు తీశారు. అయితే కార్పొరేటర్ల వేతనాలు పెంపుదలను అంశాన్ని  సిపిఎం వ్యతిరేకించింది.  ఎన్ ఎంఆర్ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు శ్రద్ధ లేని పాలకులు కార్పొరేటర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం తీర్మానం చేయ‌టం దుర్మార్గ‌మ‌ని సీపీఎం అభ్యంత‌రం తెలిపింది. 


ట్రు అప్ చార్జీల పేరుతో ప్రజల్ని బాదేస్తున్నారని కార్పొరేటర్ల ఆగ్రహం


ట్రు అప్   చార్జీల పేరుతో నగర ప్రజలపై2 వందల కోట్ల విద్యుత్  భారాలు , ఎస్సీ ఎస్టీల 200 యూనిట్ల విద్యుత్ సబ్సిడీ కి కోతలకు  పాలకుపక్షం ఆమోదం తెలిపింది.   రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు సహజ ప్రమాద మరణాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా జీవో 25, వి ఎం సి ఎంప్లాయిస్ దహన సంస్కారాలకి ఇచ్చే సహాయం పెంపుదలు చేస్తూ ఇచ్చిన జీవో 60 కౌన్సిల్లో రికార్డ్ చేసి అమలు చేయాలని సిపిఎం ప్రతిపాదనలు తిరస్కరించింది. అయితే  కౌన్సిల్ నిర్వహణలో వైఫల్యం చెందిదని పాలకపక్షంపై విపక్షాలు మండిపడ్డాయి.   ప్రజల ఎజెండా పై గొంతు నోక్కేందుకు మీడియాను కూడా  లోపలికి రానివ్వకుండా ప్రజాస్వామ్యాన్ని వైసీపీ అపహాస్యం చేసింద‌ని మండిప‌డ్డాయి. 


అభివృద్ధి పనులపై నిలదీసిన కార్పొరేటర్లు


 త‌మ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు కౌన్సిల్ లో ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని, ప్రజా వ్యతిరేక పరిపాలనకు నిరంకుశ భారాల పరిపాలన కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని సిపిఎం  మండిపడింది. బెజ‌వాడ కార్పోరేష‌న్ ప‌రిదిలో కొండ ప్రాంతాల్లో ఉన్న డివిజ‌న్ల అభివృద్దికి అద‌నంగా 30లక్ష‌ల రూపాయ‌లు కేటాయిస్తున్న‌ట్లు మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ ప్ర‌క‌టించారు.కొండ ప్రాంతాల్లో ఉన్న డివిజ‌న్ల లో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి,తాగునీరు,వీదిదీపాల ఏర్పాటు వంటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.అంతే కాదు విజ‌య‌వాడ న‌గ‌రంలో చేప‌ట్టాల్సిన అభివృద్ది ప‌నులు పై రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిన ఇచ్చామ‌ని,అనుమ‌తులు తో పాటుగా నిదులు రాగానే ప‌నులు ప్రారంభిస్తామ‌ని అన్నారు.మ‌రో వైపున రాజ‌కీయాల‌కు అతీతంగా కౌన్సిల్ స‌మావేశాలు జ‌రిగాయ‌ని,ప్ర‌తిప‌క్షాలు అన‌వస‌రంగా రాజకీయం చేస్తున్నాయని మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి విమర్శించారు. ఒక్క విజయవాడలోనే కాకుండా మున్సిపల్ కౌన్సిల్ భేటీలు ఎక్కడ జరిగినా చెత్త పన్నుపై పదే పదే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.