Chirala Murder: బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో దారుణం జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న 18 ఏళ్ల సయ్యద్ ఆరీఫ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు పొడిచి పడేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు చనిపోయాడు. 


మంగళవారం రోజున చీరాల నుంచి ఈపూరుపాలెం  వస్తున్నాడు ఆరీఫ్. అతనితో స్నేహితుడు మనోజ్ కూడా ఉన్నారు. ఇతను సైకిల్‌పై ఉంటే మనోజ్‌ బైక్‌పై వెళ్తున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆదినారాయణపురం వద్దకు వచ్చేసరికి ఓ కారు వాళ్ల వెనకాలే వచ్చింది. హారన్ మోగించింది. వాళ్లు పక్కకు తప్పుకున్నారు.  


రెండు అడుగులు దూరం వెళ్లిన కారు ఆగింది. ఆరీఫ్‌, మనోజ్‌ వెళ్తుండగా వారిని పట్టుకొని కొట్టడం ప్రారంభించారు కారులోని వ్యక్తులు. ఏం జరుగుతోందని తెలుసుకునేలోపు బూతులు తిడుతూ కారు వస్తుంటే తప్పుకోవడం తెలియదా అంటు ఐదుగురు వచ్చి రుబాబు చేశారు. 


సైకిల్‌పై వెళ్తున్న ఆరీఫ్‌ను కొట్టిన ఐదుగురు వ్యక్తులు కారులో ఉన్న కత్తులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు పొడిచారు. దీంతో మనోజ్ భయపడిపోయాడు. ఆరీఫ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరీఫ్ చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. 


స్థానికుల సమాచారంతో స్పాట్‌కు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్పాట్‌లోనే ఉన్న మనోజ్‌ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం కారుకు సైడ్ ఇవ్వలేదని హత్య చేశారా లేకుంటే ప్లాన్ ప్రకారం జరిగిందా అనేది తేల్చే పనిలో ఉన్నారు.మృతుడి తండ్రి చీరాలలో ఓ వస్త్ర దుకాణ యజమానికి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.