Ayesha Meera Murder Case Victim Satyam Babu: చేయని నేరానికి 9 ఏళ్లు జైలులో గడిపిన పిడతల సత్యంబాబు ఇప్పటివరకూ తనకు న్యాయం మాత్రం జరగలేదని ఆరోపించాడు. బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు నుంచి సత్యంబాబు నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ కేసులో సత్యంబాబు చాలా కాలంపాటు జైలు జీవితాన్ని గడపగా.. హైకోర్టు సత్యం బాబును నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2017లో తన పరిస్థితిని వివరించి తనకు 2 ఎకరాల సాగు భూమి, రూ. 10 లక్షల పరిహారం, ఇల్లు ఇవ్వాలని అప్పట్లో కలెక్టర్‌ను కోరాడు. నందిగామ ఎమ్మార్వో ఆఫీసుకు సైతం సత్యంబాబుకు సహాయం అందించాలని కలెక్టర్ సూచించారు. ఇన్నేళ్లు గడిచినా న్యాయం జరగకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు.


ఉమ్మడి ఏపీలో సంచలనం రేపిన అయేషా మీరా హత్య కేసులో 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన అనంతరం నిర్దోషిగా బటయపడ్డాడు సత్యం బాబు. అయితే తన జీవితంలో విలువైన సమయాన్ని చేయని నేరానికి జైళ్లో గడిపానని, తనకు ఉద్యోగం ఇచ్చేవారు ఎవరూ లేరని గతంలోనూ చెప్పాడు. ఏళ్లు గడుస్తున్నా ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహకారం అందకపోవడంతో నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును సత్యం బాబు కలిశాడు. చేయని నేరానికి జైలులో గడిపిన తనకు కింది కోర్టు విధించిన జీవితఖైదు, జరిమానాలను హైకోర్టు రద్దు చేసింది. ఖర్చుల కింద సత్యంబాబుకు రూ. లక్ష చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ఇంకా న్యాయం జరగలేదు..
నిర్దోషిగా తాను కేసు నుంచి బయటపడ్డా ప్రయోజనం మాత్రం లేదన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని వ్యవసాయం కోసం 2 ఎకరాలు, సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు, ఇల్లు ఇప్పించి సహాయం చేయాలని కోరగా 2017లో కలెక్టర్ ఓకే చెప్పారు. కానీ నాలుగేళ్లు గడిచిపోయినా తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని, నేడు కలెక్టర్ స్పందన కార్యక్రమంలో మరోసారి ఆయనను కలుసుకుని తన పరిస్థితిని సత్యం బాబు వివరించాడు. గతంలో తనకు సహాయం కోసం చేసిన దరఖాస్తులు, తాజాగా మరో దరఖాస్తును కలెక్టర్‌కు సత్యంబాబు సమర్పించాడు. 


సత్యంబాబు బాధలు వర్ణనాతీతం..
సత్యంబాబు జైల్లో ఉండగానే అతడి తండ్రి మరణించారు. జైలు నుంచి విడుదలయ్యాక.. పెళ్లీడుకు వచ్చిన చెల్లెలు, వయసు మీద పడిన తల్లిని పోషించే ఆర్థిక సోమత లేక సాయం కోసం ఎదురు చూశాడు. చెల్లెలికి పెళ్లి చేసిన కొన్ని రోజులకే తల్లి మరియమ్మ మతిస్థిమితం కోల్పోవడంతో సమస్యలు రెట్టింపయ్యాయి. అయేషా మీరా హత్య కేసులో అరెస్టుకు ముందే మరదలితో సత్యంబాబు వివాహం జరిగింది. ఏదో కారణంతో వీరిద్దరూ విడిపోగా.. జైలు నుంచి విడుదలైన సత్యంబాబు మహబూబాబాద్‌కు చెందిన ఓ ఫాస్టర్ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అయితే విలువైన సమయం జైల్లో గడిపిన తనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాడు.


Also Read: Ayesha Meera Case: పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి... రూ. 10 కోట్లు పరిహారం ఇవ్వాలని సత్యంబాబు డిమాండ్ 


Also Read: Vijayawada Drugs : బెజవాడ డ్రగ్స్ కథ ఎక్కడ తేలబోతోంది ? అరుణాచలం గుట్టు బయట పెట్టేశాడా ?