Chandra babu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఇదే కేసులో ఆయనకు రాష్ట్ర హైకోర్టు ఈనెల 10న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... దీనిపై నేడు జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ దీపాంకార దత్తతో కూడిన ధర్మాసనం విచారించనుంది.


ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ఇన్నర్‌రింగ్ నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా భూసేకరణ చేపట్టింది. రోడ్డు నిర్మాణం చేపట్టక ముందే ఎన్నికలు రావడం... తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి వైకాపా అధికారం చేపట్టింది. అనంతరం ముఖ్యమంత్రి జగన్ రాజధాని నిర్మాణం, భూసేకరణపై విచారణ చేపట్టి ఇన్నర్‌రింగ్ నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించింది. తమకు కావాల్సిన వారికి అనుకూలంగా ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ మార్చారని ప్రధాన ఆరోపణ. తెలుగుదేశం నేతల బినామీల భూములకు లబ్ధి చేకూర్చేలా ఇన్నర్‌రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టారని వైకాపా ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసులో చంద్రబాబును బాధ్యుడిని చేస్తూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు సీఐడీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.....న్యాయస్థానం కొట్టివేసింది. దీనిపై ఆయన రాష్ట్ర హైకోర్టులో అప్పీలు చేయగా....సుదీర్ఘంగా విచారించిన అనంతరం రాష్ట్ర హైకోర్టు ఈనెల 10న చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నేరాభియోగాలు నిరూపించే వరకు ఆయన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది..


ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో ఆయనపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని....వాటికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ ఏపీ సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది. చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరింది. దీంతోపాటు మద్యం, ఇసుక కుంభకోణం కేసుతోపాటు స్కిల్ డెలప్‌మెంట్‌ కేసుల్లో ఆయన బెయిల్‌పై బయటే ఉన్నారని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది.


స్కిల్ కేసులో ఇప్పటికే దాదాపు 2 నెలలకు పైగా జైలులో ఉన్న చంద్రబాబు..ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. గత ప్రభుత్వ  హయాంలో తీసుకున్న నిర్ణయాలపై   సీఐడీ విచారణ జరిపి అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా 17 ఏ నిబంధన ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనంటూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం ఇటీవలే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు వెలువరించడంతో ఈ పిటిషన్ సీజేఐ విస్తృత ధర్మాసనం ముందుకు వెళ్లింది. త్వరలోనే ఈ పిటిషన్ పై విచారణ జరిపి చంద్రబాబు దాఖలు చేసిన  క్వాష్ పిటిషన్ పై నిర్ణయం తెలపనుంది. అదే సమయంలో చంద్రబాుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక కేసులన్నీ ఈ క్విష్ పిటిషన్ తోనే ముడిపడి ఉండటంతో....నేడు ఇన్నర్ రింగ్ రోడ్డుపై జరగనున్న కేసు విచారణ పై ఉత్కంఠ నెలకొంది.