AP Govt News: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ మంగ‌ళ‌వారం మ‌ళ్లీ రూ.3 వేల రూపాయ‌లు అప్పుడు కోట్ల అప్పు చేసింది. రిజ‌ర్వు బ్యాంకులో నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో బాండ్ల‌ను ప్ర‌భుత్వం విక్రయించి రూ. 3 వేల కోట్ల‌ను స‌మీక‌రించుకుంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తి మంగ‌ళ‌వారం అప్పులు చేస్తూ వ‌స్తోంది. తాజాగా తెచ్చిన అప్పుతో అధికారంలోకి వ‌చ్చిన రెండు నెలలు కూడా గ‌డ‌వ‌క ముందే మొత్తం అప్పుడు రూ. 12 వేల కోట్ల‌కు చేరిన‌ట్ల‌యింది. మొట్ట‌మొద‌టి సారి జూన్ 25న రూ. 2 వేల కోట్లు, జూలై 2న రూ. 5 వేల కోట్లు, జూలై 16న మ‌రో రూ. 2 వేల కోట్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్పుల రూపంలో తెచ్చింది. గ‌తంలో 2019-24 మ‌ధ్య‌ ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు  జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి రాష్ట్రాన్ని శ్రీలంక‌గా మార్చేశాడ‌ని విమ‌ర్శించేవారు.


అందుకు అనుగుణంగానే అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై సీఎం చంద్ర‌బాబు శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేశారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పుల భారాన్ని రూ. 9.74 ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచుకుంటూ  పోయారని ఎద్దేవా చేశారు. వాటిని స‌రిచేయాల్సిన బాధ్య‌త మ‌న ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు కూడా ఆలోచ‌న చేయాల్సి ఉంటుంద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వాస్త‌వ ప‌రిస్థితుల‌ను వివ‌రించేందుకే శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేస్తున్న‌ట్లు చంద్రబాబు వివ‌రించారు. 


అప్పుల‌పై వైసీపీ ఆగ్ర‌హం


కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన నాటి నుంచి చేస్తున్న అప్పుల‌పై వైసీపీ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. కేవ‌లం రెండు నెల‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే రూ. 12 వేల కోట్లు అప్పులు చేయ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేస్తోంది. మేం అధికారంలో ఉన్న‌ప్పుడు రాష్ట్రాన్ని శ్రీలంక‌గా మార్చార‌ని ఆరోప‌ణ‌లు చేసి, ఇప్పుడు త‌మ‌రు చేస్తున్న‌దేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మాక‌న్నా రెండింత‌లు ఖ‌ర్చ‌య్యే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తాన‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు, సంప‌ద సృష్టిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ఇదే సంప‌ద సృష్టించ‌డం అంటే అని విమ‌ర్శిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక పింఛ‌న్ల పంపిణీ త‌ప్ప మ‌రే ఇత‌ర సంక్షేమ ప‌థ‌కం కూడా అమ‌లుకు నోచుకోలేదు. వారు గొప్ప‌గా ప్ర‌చారం చేసుకున్న సూప‌ర్ 6 లోని త‌ల్లికి వంద‌నం, మ‌హిళ‌ల‌కు నెలకు రూ. 1500, ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, నిరుద్యోగ భృతి, రైతుల‌కు ఏడాదికి రూ. 20 వేలు, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండ‌ర్లు వంటి ఏ ప‌థ‌కం కూడా అమ‌లుకు నోచుకోలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం పైనా వైసీపీ అనుమానాలు వ్య‌క్తం చేసింది. వారు చేస్తున్న రుణాలను క‌న‌ప‌డ‌కుండా చేయ‌డానికి జ‌రుగుతున్న ప్ర‌య‌త్న‌మేన‌ని విమ‌ర్శిస్తోంది. 


అసెంబ్లీలో లోకేశ్ ప్ర‌క‌ట‌న‌పై అనుమానాలు 


అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశాల సంద‌ర్భంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ఏడాది పాటు ప‌థ‌కాల అమ‌లుపై కింది స్థాయి వ‌ర‌కు కూలంక‌షంగా చర్చించి, అంద‌రికీ న్యాయం చేసే విధంగా ప‌థ‌కాల‌ను ఏడాది త‌ర్వాత అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. లోకేశ్ ప్ర‌క‌ట‌న‌తో ల‌బ్దిదారులు అయోమ‌యంలో ప‌డిపోయారు. త‌ల్లికి వంద‌నం కింద ఎంత‌మంది పిల్ల‌లుంటే అంద‌రికీ రూ. 15వేల చొప్పున ఇస్తామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌ప్పుడు హామీ ఇచ్చింది. ఇప్పుడు వారంతా లోకేశ్ ప్ర‌క‌ట‌న‌తో ఉసూరుమంటున్నారు.  3 గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితంగా ఇస్తామ‌న్న హామీపై మ‌రో మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ ప్ర‌స్తుతానికి అమ‌లు చేయ‌డం లేద‌ని అసెంబ్లీలో చెప్పారు. ఆగస్టు 15 నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం హామీ అమ‌లుకానుంద‌ని సోష‌ల్ మీడియాలో టీడీపీ, జ‌న‌సేన శ్రేణులు ప్ర‌చారం చేసుకున్నా, ప్ర‌భుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్ఫష్ట‌మైన హామీ మాత్రం రాలేదు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ మాట్లాడుతూ బ్లీచింగ్ పౌడ‌ర్ కొన‌డానికి కూడా ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని చెబుతున్నారు. నా ఆఫీస‌ర్ ఫ‌ర్నీచ‌ర్ కూడా సొంత డ‌బ్బుల‌తోనే తెచ్చుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు. 


కేంద్రం ఇస్తామ‌న్న రూ. 15 వేల కోట్ల‌పైనే ఆశ‌లు 


ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో ప‌థ‌కాలు అమ‌లు జ‌రగ‌డంపైనే ర‌క‌రకాల అనుమానాలు త‌లెత్తుతున్నాయి. మ‌రోవైపు అమ‌రావ‌తి నిర్మాణం గురించి కూడా మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ ప్ర‌భుత్వం వ‌ద్ద స్థోమ‌త లేద‌ని సెల‌విచ్చారు. మ‌రోవైపు కేంద్రం అమ‌రావ‌తి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు వివిధ బ్యాంకుల ద్వారా స‌మీక‌రించి అప్పుగా ఇస్తామ‌ని బ‌డ్జెట్ సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది. దానిపైనే ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తుంది.