AP NGO Meeting: ఏపీ ఎన్‌జీవోస్‌ 21వ రాష్ట్ర మహా సభలు ఆగస్టు 21, 22 తేదీలలో విజయవాడ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మహా సభలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ( AP CM YS Jagan Mohan Reddy)ని ఏపీ ఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌ (ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం) ఆహ్వానించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎం వైఎస్ జగన్ ను అసోసియేషన్ ఆహ్వానించింది. ఈ విషయాన్ని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు తెలిపారు. సీఎం జగన్ తో పాటు రాష్ట్ర మంత్రులను ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. 


బండి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఏపీ ఎన్జీవో సంస్థకు 74 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ ను ఆహ్వానించాం అని చెప్పారు. మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను చివరికి సీఎం జగన్ క్రమబద్దీకరణ చేశారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల కలను సాకారం చేశారని కొనియాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసిన సీఎం జగన్ కు ఎన్జీవోల తరపున బండి శ్రీనివాస్ రావు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఏఎన్ఎం లకు లబ్ది చేకూర్చేలా జీవో వస్తుందన్నారు. సీపీఎస్‌ రద్దు వంటి మరికొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.


గతంలో పీఆర్సీ కమిషన్ కోసం తన్నులు..
గతంలో పీఆర్సీ కోసం ధర్నాలు చేయాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఒక నెల ముందుగానే పీఆర్సీ కమిషన్ ను సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. గతంలో పీఆర్సీ కమిషన్ కోసం లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చేదని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిందని, సీఎం జగన్ పై మాకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ఎన్జీవో కౌన్సిల్ సమావేశంలో పలు సమస్యలపై చర్చిస్తాం అన్నారు. దిగువ ఉన్న ఉద్యోగ తరగతి సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్తాం. ఏపీ విభజన తరవాత బలవంతపు బదిలీ వద్దుని కోరుతున్నామని చెప్పారు. జీపీఎఫ్ , సరెండర్ లివ్ బిల్లులు ఆగస్ట్ లో విడుదల చేయాలని సీఎంని కోరనున్నట్లు తెలిపారు. మహిళలకు 5 రోజులు నిబంధన అమలు చేయాలని కోరతామన్నారు. ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.
Also Read: AP Volunteers Delhi High Court : ఢిల్లీ హైకోర్టులో ఏపీ వలంటీర్ల కేసు విచారణ - పూర్తి వివరాలివ్వాలని ప్రభుత్వానికి నోటీసులు !


అసోషియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్‌సీతో పాటు మధ్యంతర భృతిని డిసెంబరులో సాధించేలా ఎన్జీవో సంఘం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ఉద్యోగులు దక్కించుకోవాల్సిన డిమాండ్ల సాధనకు ఈ మహా సభలు వేదికగా నిలుస్తాయన్నారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున మహా సభలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial