ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల మొదటి వారంలో శాసన సభ భేటీ కానుంది. వచ్చే నెల 4 లేదా 7 తారీఖుల్లో సమావేశాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను తీసుకురానున్నట్లు సమాచారం. అలాగే 2022-23 బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కొవిడ్ తీవ్రత లేకపోతే రెండు వారాలకుపైగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.


రాజధాని పై తేల్చేస్తారా..!
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులను సంబంధించిన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టాలనే పట్టుదలతో వైఎస్ జగన్ ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటుగా.. మూడు రాజధానుల్లోనూ ఒకేసారి పరిపాలనను ఆరంభించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఉగాది నుంచి అమలులోనికి రానున్నాయి. అయతే ఉగాదికి దాదాపు రెండు నెలల సమయం ఉన్నందున ఈ లోపులోనే అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవడంపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించిందని సమాచారం. 


కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టనున్న సొంత పార్టీ సభ్యుల ప్రశ్నలు


ఏపీలోని జిల్లాల సంఖ్యను అకస్మాత్తుగా 26కు పెంచడంపై పాలనా సౌలభ్యం పరంగా  హర్షం వ్యక్తమైనా పాత జిల్లాలను విభజించిన విధానంపై మాత్రం సొంత పార్టీ నేతల నుంచే వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురవుతుంది. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కడప నుంచి సైతం అసమ్మతి వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీటైన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం కనపడుతుంది. 


టీడీపీ పరిస్థితి ఏంటి?


గత అసెంబ్లీ సమావేశాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు తనను, తన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా అసభ్య పదజాలంతో దూషించారంటూ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు చంద్రబాబు.  మళ్ళీ అధికారంలోకి వచ్చాకే శాసనసభలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ సైతం చేశారు. అయితే ఆ తరువాత మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకోవడం, కొత్త జిల్లాల ఏర్పాటు, OTS పథకం అమలులోనికి తేవడం వంటి కీలక కార్యక్రమాలు తెరపైకి తెచ్చింది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాగూ సభకు రారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపిస్తారా లేకుంటే మొత్తానికే సమావేశాలను బహిష్కరిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. 


సభను కుదిపేయనున్న గుడివాడ క్యాసినో వ్యవహారం :


ఎప్పుడూ విపక్షాలపై తనదైన శైలిలో దూసుకుపోయే మంత్రి కొడాలి నానికి మాత్రం ఈ సమావేశాలు కాస్త కఠినం అనే చెప్పాలి.  సంక్రాంతి సందర్బంగా వెలుగులోనికి వచ్చిన గుడివాడ క్యాసినో వ్యవహారం విపక్షాలకు ఒక ఆయుధంగా మారే అవకాశం కనపడుతుంది. విపక్ష సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు, ఆరోపణలకూ కొడాలి నాని ఎలా సమాధానం చెబుతారో చూడాలి. 


గతంలో ఎన్నడూ లేనంతగా విపక్షాల చేతికి దొరికిన అస్త్రాలు


వైసిపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష టీడీపీ కంటే కాస్త పైచేయి వైసీపీదే ఉంటూ వచ్చింది. సన్నబియ్యం వివాదం, మూడు రాజధానుల వ్యవహారం, శాసన మండలి రద్దు, అంతర్వేది అంశం ఇలా ఎలా చూసినా ప్రభుత్వం తమ వాదనతోనో, దూకుడు తోనో విపక్షాన్ని డామినేట్ చేస్తూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం వైసీపీకి అదంత సులభం కాకపోవచ్చు. నిత్యావసరాల ధరలు,శాసన మండలి రద్దును వెనక్కు తీసుకోవడం, పీఆర్సీపై ప్రభుత్వ వైఖరి, OTS అమలు, గుడివాడ క్యాసినో, కేంద్ర బడ్జెట‌్‌లో ఏపీకి అన్యాయం జరిగినా సీఎం జగన్ నోరు మెదపక పోవడం ఇవన్నీ విపక్షాలకు తిరుగులేని ఆయుధాలు కానున్నాయి.  ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎలా జరుగుతాయో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.