AP CM Chandra Babu Key Statement On Tirumala: తిరుమల లడ్డూ వివాదం ఇప్పట్లో అగిపోయేలా కనిపించడం లేదు. ఈ వివాదం నడుస్తుండగానే తిరుమలకు వెళ్తానంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటన మరింత సంచలనంగా మారింది. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎన్డీఏ నేతలతోపాటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన్ని తిరుపతిలో అడుగు పెట్టనీయబోమంటూ స్వామీజులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇంకోవైపు డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు స్థానిక నేతలు. పోలీసులు యాక్ట్ 30ని కూడా అమలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూ వచ్చింది. 


తిరుమల పవిత్ర విషయంలో తగ్గేది లేదన్న చంద్రబాబు


పరిస్థితి ఈ సాగుతున్న టైంలో సీఎం చంద్రబాబు పెట్టిన ట్వీట్ మొత్తం సీన్‌నే మార్చేసింది. టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరిన చంద్రబాబు భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు." కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నాను. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను" అనిచంద్రబాబు చెప్పారు. 






ఈ ట్వీట్ వచ్చిన అరగంటలోనే వైఎస్ జగన్ పర్యటన రద్దు ప్రకటన వచ్చింది. అంతకంటే ముందు వైసీపీ ఓ సంచలన ట్వీట్ చేసింది. జగన్‌పై తిరుపతిలో దాడి చేసేందుకు యత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఒక్కొక్క పరిణామాం వైసీపీకి ప్రతికూలంగా మారుతున్న వేళ జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ప్రజల భద్రత, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని కుట్రలు జరగకూడదన్న ఆలోచనతోనే పర్యటన రద్దు చేసుకున్నామంటున్నాయి వైసీపీ శ్రేణులు.