YSRCP raises doubt over Ghee Adulteration in Tirumala | తిరుమల: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఇటీవల జరిపిన పరీక్షల్లో తేలడం కోట్లాది భక్తులను ఆందోళనకు గురిచేసింది. అయితే కూటమి ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే కల్తీ నాటకాన్ని తెర మీదకు తెచ్చారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల అన్నారు. వంద రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజాగ్రహాన్ని డైవర్షన్ చేయడంలో భాగంగా తిరుమల వివాదాన్ని తెరపైకి తెచ్చారని జగన్ చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నను సంధించారు. నెయ్యిలో కల్తీని కనుక్కునే సౌకర్యాలు, సదుపాయాలు తిరుమల ల్యాబ్‌లో కూటమి నేతలు చెబుతున్నారు.. అంటే 2014-19 సమయంలోనూ కల్తీ జరిగిందని ఒప్పుకుంటారా అని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది.


గతంలో మీరు ఎలా తేల్చారు, ఇప్పుడు ఎందుకీ సమస్య?


‘తిరుమల ల్యాబ్‌లో నెయ్యిలో కల్తీని కనుక్కునే సౌకర్యాలు, పరికరాలు లేవని అంటున్నారు. అయితే 8 ఏళ్ల క్రితం 2017లో చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెయ్యి కల్తీపై ఆరోపణలు వచ్చాయి. అప్పుడు టీటీడీ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌ అధికారిణిగా ఉన్న షర్మిష్ట దీనిపై స్పష్టత ఇచ్చారు. నెయ్యి తీసుకువచ్చే ప్రతి ట్యాంకర్‌కూ 3 టెస్టులు చేస్తామని, తేమలో లోపం ఉన్నా, వెజిటబుల్‌ ఫ్యాట్ ఉన్నా, జంతువుల ఫ్యాట్ ఉన్నా.. గుర్తిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలేని, స్వచ్ఛత లేని నెయ్యిని తయారీకి వాడే ప్రసక్తేలేదని చెప్పారు. దీనిపై సమాధానం ఏంటి? తిరుమలలో ల్యాబ్‌ లేకపోతే 2014-19 మధ్య కూడా మరి ఎలాంటి నెయ్యి వాడారు? ఆరోజుల్లో కూడా కల్తీ జరిగినట్టేనని ఒప్పుకుంటారా అని’ వైసీపీ పోస్ట్ చేసింది. టీటీడీ అంశంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.


తిరుమలలో ల్యాబ్ లేని కారణంగా గుజరాత్ కు పంపి టెస్టులు చేపించగా నెయ్యిలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లాంటివి కలిశాయని తేలిందని టీటీడీ ఇదివరకే తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఇదే విషయంపై సంచలన విషయాలు వెల్లడించారు. వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదాలతో పాటు ఇంకా చాలా అపచారం జరిగిందని, ఐజీ స్థాయి అధికారిని సిట్ చీఫ్ గా నియమించి విచారణ చేపడతామన్నారు. తిరుమలలో కల్తీపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు పోలీసులు ఈ సిట్ బృందంలో ఉండనున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేయడంతో పాటు అత్యంత పవిత్రత కలిగిత తిరుమల శ్రీనివాసుడ్ని అపవిత్రం చేసేలా, ఆయనకు కళంకం తెచ్చేలా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. త్వరలోనే సిట్ టీమ్ కల్తీ నెయ్యిపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.


Also Read: Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం